
హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నిధుల గోల్ మాల్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఏ2 నిందితుడిగా ఉన్న HCA సెక్రటరీ దేవరాజ్ అరెస్ట్ అయ్యాడు. పరారీలో ఉన్న దేవరాజ్ను శుక్రవారం (జూలై 25) తమిళనాడులో అదుపులోకి తీసుకున్నారు సీఐడీ పోలీసులు. అనంతరం నిందితుడు దేవరాజ్ను మల్కాజిగిరి కోర్టులో ప్రవేశపెట్టారు.
కాగా.. ఐపీఎల్ టికెట్ల ఇష్యూ, హెచ్సీఏ నిధుల గోల్ మాల్ కేసులో హెచ్సీఏ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావుతో పాటు హెచ్సీఏ జనరల్ సెక్రటరీ దేవరాజ్, ట్రెజరర్ జగన్నాథ్ శ్రీనివాస్ రావు, సీఈవో సునీల్ కుమార్, శ్రీ చక్ర క్రికెట్ క్లబ్ జనరల్ సెక్రెటరీ రాజేందర్ యాదవ్, రాజేందర్ యాదవ్ భార్య కవిత మొత్తం ఆరుగురిపై సీఐడీ పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఇందులో సెక్రటరీ దేవరాజ్ పరారీలో ఉండగా మిగిలిన నిందితులందరిని జూలై 9 అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు పోలీసులు.
►ALSO READ | ప్రైవేట్ కాలేజీల్లో ఫీజుల నియంత్రణకు తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం
అనంతరం వైద్య పరీక్షలు నిర్వహించి జూలై 10న మల్కాజిగిరి కోర్టులో హాజరుపర్చారు. నిందితులకు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది మల్కాజిగిరి కోర్టు. కేసులో ఏ2 నిందితుడిగా ఉన్న సెక్రటరీ దేవరాజ్ మాత్రం ఈ కేసు నమోదు కాగానే పారిపోయారు. దాదాపు 20 రోజులుగా పోలీసుల కళ్లుగప్పి తిరిగారు. ఈ క్రమంలో దేవరాజ్ పై మరింత ఫోకస్ పెట్టిన పోలీసులు.. తమిళనాడులో ఉన్నట్లు గుర్తించారు. శుక్రవారం (జూలై 25) తమిళనాడు వెళ్లి అదుపులోకి తీసుకున్నారు.