హైదరాబాద్, వెలుగు: హెచ్సీఎల్ టెక్ సంస్థ ఏజెంటిక్ ఏఐ వాడకాన్ని ప్రపంచవ్యాప్తంగా విస్తరించేందుకు గూగుల్ క్లౌడ్తో భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకుంది. గూగుల్ అభివృద్ధి చేసిన జెమిని ఎంటర్ ప్రైజ్ మోడల్స్ సాయంతో అంతర్జాతీయ క్లయింట్ల కోసం అత్యాధునిక ఏఐ ఏజెంట్లను ఈ సంస్థ రూపొందించనుంది. ఈ ఏఐ ఏజెంట్లు వ్యాపార రంగాల్లోని సమస్యలను పరిష్కరించడంతో పాటు ఉత్పాదకతను పెంచడానికి తోడ్పడతాయి.
ముఖ్యంగా సాఫ్ట్ వేర్ అభివృద్ధి, ఐటీ కార్యకలాపాలను మెరుగుపరిచే లక్ష్యంతో హెచ్సీఎల్టెక్ తన ఏఐ ఫోర్స్ ప్లాట్ ఫామ్ ను వినియోగిస్తోంది. వ్యాపార అవసరాలకు అనుగుణంగా గూగుల్ క్లౌడ్ ఆధారిత ఏఐ సేవలను అందించేందుకు సంస్థ భారీ ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇందులో భాగంగా గూగుల్ క్లౌడ్ విభాగంలో పనిచేసే నిపుణుల సంఖ్యను రాబోయే మూడేళ్లలో 12 వేల నుంచి 35 వేలకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నామని హెచ్సీఎల్ టెక్ ప్రకటించింది.
