
తెలంగాణ ప్రాంత విద్యార్థి విజయాలు రాష్ట్రవ్యాప్తంగానే కాకుండా దేశంలోనే అనేక ఫలితాలలో అగ్రగామిగా నిలబడుతుండడం రాష్ట్ర ప్రజలందరికీ గర్వకారణం. నాణ్యమైన విద్యనభ్యసించడం కోసం, సగటు మనిషి తనకున్న ఆర్థిక వనరులను పూర్తిగా వినియోగించి, అవసరమైతే రుణాలు సైతం తీసుకొని తమ బిడ్డల భవిష్యత్తు కోసం విద్యపై ఖర్చు చేస్తున్నాడు. కానీ, దీనినే అదనుగా తీసుకొని, ప్రైవేట్ విద్యాసంస్థలు భారీగా ఫీజులు వసూలు చేసి, వారిని నిర్వీర్యం చేసే ప్రయత్నం చాలాకాలంగా కొనసాగుతోంది. విద్యా వ్యాపారాన్ని చట్టబద్ధంగా నియంత్రణ చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుండడంతో ప్రైవేట్ సంస్థలకు కాసుల పంట కొనసాగుతోంది.
జాతీయ స్థాయి నాణ్యత విద్యాసంస్థలలో ప్రవేశం పొందడం కోసం, కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ పుట్టగొడుగుల్లాగా పుట్టుకొచ్చి, రకరకాల మాయలు, మోసాలు చేస్తూ విద్యార్థులను ఆకర్షిస్తున్నారు. కొన్ని విద్యాసంస్థలు విలువలు పాటిస్తున్నప్పటికీ, చాలా ఎక్కువ శాతం మాత్రం ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని, విద్యా వ్యాపారం ద్వారా ధనార్జన కేంద్రంగా పనిచేస్తున్నాయి. తెలంగాణలో పోటీ పరీక్షలకు కోచింగ్ రంగం గత పది ఏళ్లలో అనూహ్యంగా పెరిగింది. చాలా కోచింగ్ సంస్థలు ప్రధాన వ్యూహం ర్యాంకర్ల పేర్లను వాడటం. ఒక్క విద్యార్థి ర్యాంకును పదుల సంస్థలు ప్రచారం చేసుకుంటున్న దృశ్యాలు ఇప్పుడు నిత్యం సామాన్యమైపోయాయి.
ఫేక్ ప్రచారాలు
కోచింగ్ సంస్థలు ఐఐటీ జేఈఈ, నీట్, ఎంసెట్, సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ ఫలితాలు, ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ల ఫలితాలు వచ్చిన వెంటనే వాస్తవికంగా తమకు సంబంధం లేని విద్యార్థుల పేర్లు, ఫోటోలు ర్యాంకులను తమ ప్రచారంలో వాడుతున్నారు. కొన్ని సంస్థలు ఒకే విద్యార్థిని పలుచోట్ల రిజిస్టర్ చేసి, ఒకే ర్యాంకును తమదిగా ప్రకటిస్తున్నాయి. ప్రత్యేకంగా కోర్సు తీసుకోకపోయినా, 'వీరు మా స్టడీ మెటీరియల్ వాడారు అంటూ'అసత్య ప్రకటనలు ఇస్తున్నారు. కొంతమంది ర్యాంకర్లను డబ్బుతో బ్రాండ్ అంబాసిడర్గా చేసుకొని ప్రచారానికి వాడుకుంటున్నారు. ఇలాంటివాటికి కొన్ని సందర్భాల్లో విద్యార్థులు నిస్సహాయంగా ఒప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇలా అనేక రూపాలలో విద్యార్థులను మభ్యపెడుతూ విద్యార్థులు తల్లిదండ్రులు గందరగోళానికి గురై, లక్షలు ఖర్చుపెట్టి ఆ కోచింగ్ సంస్థల్లో తమ పిల్లల్ని చేర్పిస్తున్నారు. ఆ తర్వాత వాస్తవ బోధన స్థాయి, కనీస వసతులు లేకపోవడంతో తీవ్ర నిరాశను వారికి మిగులుస్తున్నాయి. వీటికి తోడు అడపదడపా, పోటీ పరీక్షల పేపర్ లీక్ ల వ్యవహారం కూడా విద్యార్థుల ఆర్థిక పరిస్థితిని, మానసిక పరిస్థితిని మరింత కుంగదీస్తోంది.
అడ్డగోలు ఫీజులు
పాఠశాల స్థాయి నుంచి ఐఐటీ, జేఈఈ, సివిల్ సర్వీస్ ఆధారిత ఫౌండేషన్ ఇవ్వబడుతుందని ప్రకటనలతో విద్యార్థుల నుంచి అధిక ఫీజులను వసూలు చేయడం పరిపాటిగా మారింది. నర్సరీ స్కూల్ ఫీజు లక్ష నుంచి రెండున్నర లక్షల వరకు వసూలు చేస్తున్న పాఠశాలలు, ఒకటో తరగతి నుంచి పదవ తరగతి వరకు ఒక సంవత్సరానికి సగటున 2 లక్షల నుంచి 8 లక్షల వరకు ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేటు విద్యాసంస్థలు ఉన్నాయి. అదేవిధంగా ఒక ఏడాదికి ఇంటర్ ప్లస్ , నీట్ కోర్స్ కోసం దాదాపుగా రెండు లక్షల నుంచి ఏడు లక్షల వరకు వసూలు చేస్తున్నారు. జేఈఈ లేదా ఎంసెట్ కోర్సులకైతే లక్షల రూపాయలను వసూలు చేస్తున్నారు. . ర్యాంకు వస్తుంది టాపర్ చేస్తామంటూ తప్పుడు హామీలతో వేలాదిమంది విద్యార్థుల జీవితాలు ఆర్థికంగా విచ్చిన్నమవుతున్నాయి. ప్రైవేట్ యూనివర్సిటీలలో సాధారణ డిగ్రీ కోర్సులలో సైతం నాలుగు నుంచి ఆరు లక్షల వరకు వసూలు చేస్తున్నారు. వృత్తి విద్యా కోర్సులకైతే చెప్పనక్కర్లేదు. ఇంతటి ఖరీదైన విద్య ఒక సామాన్య సగటు మనిషి పిల్లలకు అందించలేక సతమతమవుతున్న అమాయక ప్రజలు ఎందరో ఉన్నారు.
కనీస సౌకర్యాలు కరువు
అనేక కోచింగ్ సెంటర్లలో మౌలిక వసతులు లేకపోవడం, విద్యార్థులకు సరైన బోధన సిబ్బంది లేకపోవడం, ఫ్యాకల్టీలు తాత్కాలికంగా నియమించబడి, టెస్టులు, స్టడీ మెటీరియల్పై నాణ్యతను దృష్టిలో పెట్టుకోవడం లేదు. హాస్టల్లో కనీసం సురక్షితమైన మంచినీరు, గదులలో కనీసం ఫ్యాన్లు, అవసరమైన స్థాయిల్లో మరుగుదొడ్లు, పోషకాహారం లేని భోజనాన్ని విద్యార్థులకు అందిస్తున్న పరిస్థితి కోకొల్లలుగా కనపడుతున్నాయి. విద్యార్థులపై తీవ్ర ఒత్తిడి, కొందరిలో ఆత్మన్యూనత భావం, ఆత్మహత్యలు సైతం నమోదు అవుతూనే ఉన్నాయి. కోచింగ్ సంస్థల ఒత్తిడిని భరించలేక విద్యార్థుల మృతుల సంఖ్య పెరుగుతున్నా చర్యలు మాత్రం ఎక్కడా కనిపించకపోవడం శోచనీయం.
సాఫ్ట్వేర్ శిక్షణ సంస్థల మాయ
వృత్తి విద్యా కోర్సులు పూర్తిచేసిన తర్వాత ఉద్యోగం కోసం పరుగులు పెడుతున్న యువతకు సాఫ్ట్వేర్ శిక్షణ సంస్థలు 100% ప్లేస్మెంట్ హామీ అంటూ వలవేస్తున్నాయి. కానీ వాస్తవ పరిస్థితి ఏంటి? మార్కెట్కు అనుగుణంగా సిలబస్లో మార్పులు చేయలేకపోవడం, బోధన నాణ్యత లేకపోవడం, అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ అందుబాటులో లేకపోవడం, కొన్ని సంస్థలు రెగ్యులర్గా క్లాసులు చెప్పక విద్యార్థులకు అన్యాయం జరుగుతున్నా పర్యవేక్షించే వ్యవస్థ లేదు. కొన్ని సంస్థలు కంటిచూపుగా యూట్యూబ్ వీడియోలతోనే కోర్సులు నడిపిస్తున్నాయి. చివరికి జాబ్ లభించని స్థితికి చేరుతున్నారు. విద్యార్థులకు చివరికి నిరాశే మిగులుతోంది. కొన్ని ఉన్నతమైన సాఫ్ట్వేర్ కోచింగ్ ఇచ్చే సంస్థలను చూపిస్తూ, వందలాది నాసిరకమైన సంస్థలు కోచింగ్ సంస్థలను నడిపిస్తున్నాయి. ఇలాంటి సంస్థల పైన ప్రత్యేక నియంత్రణ వ్యవస్థ అత్యంత అవసరం.
నియంత్రణ ఎక్కడ ?
ప్రైవేట్ విద్యాసంస్థలపైన, కోచింగ్ సంస్థల పైన, పూర్తిస్థాయి నియంత్రణ, పర్యవేక్షణ లేకపోవడం వల్ల సామాన్య విద్యార్థులు భారీగా నష్టపోతున్నారు. తప్పుడు ఫలితాలు ఇచ్చే బోర్డులు, ధనార్జనే లక్ష్యంగా కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ పనిచేయటం, విద్యార్థుల భవిష్యత్తును దెబ్బతీస్తున్నాయి. అన్ని రకాల కోచింగ్ సెంటర్లకి మౌలిక ప్రమాణాలు రూపకల్పన చేసి, వాటిని విధిగా అమలు చేసే వ్యవస్థను, ప్రభుత్వం అమలులోకి తేవాలి.
కోచింగ్ సెంటర్లను చట్టబద్ధం చేయాలి
ప్రతి కోచింగ్ సంస్థను తెలంగాణ స్టేట్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ అథారిటీకి అనుబంధంగా నమోదు చేయాల్సిందిగా, చట్టబద్ధం అయిన నిబంధనలు ఉండాలి. ఈ సంస్థలు ఇచ్చేటటువంటి కోచింగ్ పైన కూడా నిరంతరం మానిటరింగ్ జరగాలి. ప్రభుత్వం స్వయంగా పారదర్శక ప్రమాణాల ఆధారంగా కోచింగ్ సంస్థల గ్రేడింగ్ ఇవ్వాలి. బోధన నాణ్యత ఫలితాల విశ్వసనీయత మౌలిక సదుపాయాల ఆధారంగా, వర్గీకరణ ఏ, బి, సి గ్రేడ్ ద్వారా తల్లిదండ్రులకు ఒక స్పష్టమైన అవగాహన రావడానికి దోహదపడుతుంది.
తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి లేదా విద్యా కమిషన్ ద్వారా ఒక ఫిర్యాదు పోర్టల్ అందుబాటులో ఉంచాలి. ఎలాంటి దుర్వినియోగం జరిగినా తల్లిదండ్రులు,విద్యార్థులు అక్కడ ఫిర్యాదు చేయగలిగేలా ఉండాలి. ప్రముఖ కోచింగ్ సంస్థల ప్రచార వీడియోలు, పోస్టర్లు, బ్రోచర్ల మీద ఆన్లైన్ మీడియా సెల్ ద్వారా పరిశీలన జరిపి, తప్పులు కనిపిస్తే భారీగా జరిమానా విధించాలి. అవసరమైతే అలాంటి కోచింగ్ ఇనిస్టిట్యూట్ల గుర్తింపు రద్దుచేయాలి. జిల్లా విద్యాధికారి కార్యాలయం ద్వారా స్కూలు, కళాశాలలో సైతం ఈ అంశాల పైన విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలను చేపట్టాలి.
చర్యలు తీసుకోకపోతే..
విద్యా వ్యవస్థ అనేది ప్రజాస్వామ్యానికి పునాది. తెలంగాణ వంటి అభివృద్ధి మార్గంలో ఉన్న రాష్ట్రంలో విద్యారంగం డబ్బు దందాలకు అడ్డాగా మారితే, ప్రజల భవిష్యత్తు చీకటిమయం అవుతుంది. పోటీ పరీక్షల ఫలితాలలో మోసం, ప్రైవేట్ శిక్షణ సంస్థల దోపిడీ, అసంఘటిత నిర్వహణ ఇవన్నీ కలిసి ఒక పెద్ద అవరోధంగా మారుతున్నాయి. వీటిపైన ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే నిజమైన విద్యార్థుల భవిష్యత్తు అంధకారం అయిపోతుంది.
చిట్టెడి కృష్ణారెడ్డి, అసోసియేట్ ప్రొఫెసర్, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ