కోదాడలో యువకుడి హత్య!
కోడలి వివాహేతర సంబంధమే కారణమని మృతుడి తల్లి ఆరోపణ
కోదాడ, వెలుగు: వివాహేతర సంబంధం కారణంగా సూర్యాపేట జిల్లా కోదాడలో ఓ యువకుడు హత్యకు గురయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కోదాడ పట్టణంలోని రాజీవ్నగర్కు చెందిన మన్నూరి వెంకన్న అలియాస్ రాము (32) కు గతంలో నల్లొండ జిల్లా హజారిగూడెంకు చెందిన సైదమ్మతో వివాహమైంది. పెళ్లి తర్వాత వెంకన్న మిర్యాలగూడలో ఉంటున్నాడు. అక్కడ ఓ వ్యక్తితో సైదమ్మకు వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయంలో వెంకన్న, సైదమ్మల మధ్య గొడవలు జరుగుతున్నాయి. దీంతో వెంకన్న ఆరు నెలల కింద తమ మకాం కోదాడకు మర్చాడు. అయినా వారి మధ్య గొడవలు తగ్గలేదు. ఆదివారం రాత్రి భార్యతో కొట్లాడి బయటకు వెళ్లిన వెంకన్న సోమవారం ఉదయం వాకింగ్ గ్రౌండ్లో చనిపోయి కనిపించాడు. స్థానికుల సమాచారంతో సీఐ నర్సింహరావు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. వెంకన్న ఒంటిపై గాయాలున్నట్లు గుర్తించారు. కోడలే వేరొకరితో కలిసి తన కొడుకును హత్య చేసిందని వెంకన్న తల్లి అంకమ్మ పోలీస్ కంప్లైంట్ చేసింది.