తృణధాన్యాలైన చిట్టి రాగులు శరీరానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. క్యాల్షియం, ప్రొటీన్లు, మినరల్స్తో పాటు శరీరానికి కావల్సిన పోషకాలన్నీ వీటిలో ఉంటాయి. రాగులను నిత్యం తింటే దాంతో మధుమేహం, బీపీ సమస్యల నుంచి బయట పడవచ్చు. అందుకే రాగులను మనమెనూలో చేర్చడం ఎన్నో లాభాలు పొందొచ్చు..
వంద గ్రాముల రాగుల్లో
అత్యంత పోషకాలు ఉన్న చిరుధాన్యం రాగులు గుర్తిస్తారు. క్యాల్షియం 344 మిల్లీ గ్రాములు, ఐరన్ 3.9 మిల్లీ గ్రాములు ఉంటాయి. ఐరన్ ఇతర తృణధాన్యాలన్నింటి కన్నా అధికంగా ఉంటుంది. అంతేకాకుండా క్యాలరీలు 336, కార్బో హైడ్రేట్లు 80 శాతం , తేమ 12 శాతం ఉంటుంది. రాగి పిండిలో అత్యావశ్యకమైన అమైనో ఆసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. వీటినే ఇంగ్లీషులో ఎసెన్షియల్ అమైనో (ఈఏ) అంటారు.
రాగిదోశె తయారీకి కావలసినవి
- రాగిపిండి: ఒక కప్పు
- మినప్పప్పు: పావు కప్పు కన్నా కొంచెంతక్కువ
- పెసరపప్పు, కందిపప్పు: రెండు టేబుల్ స్పూన్లు
- జీలకర్ర: ఒక స్పూన్
- మిరియాలు: ఒక స్పూన్
- పుల్లని పెరుగు: పావు కప్పు
- ఉప్పు: తగినంత
- ఆయిల్ :పావు కప్పు
తయారీ విధానం : మినప్పప్పు, పెసరపప్పు, కందిపప్పు కలిపి కొన్ని గంటలు నానబెట్టుకొని తర్వాత రుబ్బాలి. ఇందులో రాగిపిండితో పాటు మిగిలిన పదార్థాలన్నీ కలపాలి. తర్వాత అవసరాన్ని బట్టి నీళ్లు పోసుకుంటూ దోశల పిండిలా చేయాలి. ఈ పిండిని వేడి పెనం మీద వేసి.. దోశెలా కాల్చుకుంటే కరకరలాడే రాగి దోశ రెడీ. ఇది ఎంతో రుచిగా ఉంటుంది.
రాగిపిండి బూరెలు తయారీకి కావాల్సినవి
- రాగిపిండి :250 గ్రామలు
- బెల్లం: 300 గ్రాములు
- యాలకుల పొడి:అర టీ స్పూన్
- గోధుమపిండి :250 గ్రాములు
- పచ్చి కొబ్బరి తురుము: 125 గ్రాములు
- నెయ్యి: మూడు టేబుల్ స్పూన్లు
- నూనె: వేగించడానికి
తయారీ విధానం : ఒక గిన్నెలో రాగిపిండి, గోధుమపిండి పచ్చికొబ్బరి తురుముతో పాటు యాలకుల పొడి వేసి కలుపుకోవాలి, మరో గిన్నెలో బెల్లాన్ని పాకంలా చేసి అందులో పైన సిద్ధం చేసుకున్న మిశ్రమాన్ని వేసుకోవాలి. ఉండలు కట్టకుండా కలుపుకొని.. అందులో నెయ్యి వేయాలి. ఈ మిశ్రమాన్ని చల్లగా అయ్యే వరకు పక్కన పెట్టుకోవాలి. చేతికి నెయ్యి రాసుకొని ఆ మిశ్రమాన్ని చిన్న చిన్న బూరెలుగా చేయాలి తర్వాత మరోగిన్నెలో నూనె పోసి వేగించాలి. రెడీ అయిన బూరెలను ఒక పేపర్ పై వేసి నూనె పీల్చే వరకు ఉంచుకుంటే సరిపోతుంది.
–వెలుగు,లైఫ్–

