ఎండల నుంచి ఉపశమనం పొందే చల్లటి కబురు వాతావరణ శాఖ అందించింది. ఉక్కపోతతో అల్లాడుతన్న హైదరాబాద్ పబ్లిక్ ని చిరు జల్లులు పలకరిస్తాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది.
దీనికి తోడు ఉష్ణోగ్రతలు కూడా పెరుగుతాయని హెచ్చరించింది. ఆగస్టు 28న అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురుస్తాయని, దీనికి తోడు స్వల్పంగా టెంపరేచర్ పెరుగుతుందని తెలిపింది. సెప్టెంబర్ 1 వరకు ఇదే పరిస్థితి ఉంటుందని చెప్పింది. ఆ తరువాతి రోజుల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.
సెప్టెంబర్లో వర్షాల సంగతేంటీ?
ఆగస్టు నెలలో సాధారణ వర్షపాతం నమోదుకావడంతో రైతులు రానున్న సెప్టెంబర్ నెలపైనే ఆశలు పెట్టుకున్నారు. కానీ వారికి వాతావరణ శాస్త్రవేత్తలు చేదు వార్త చెప్పారు. స్కైమెట్, ఏషియన్ క్లైమేట్ సెంటర్ వివరాల ప్రకారం.. దక్షిణ, మధ్య భారతదేశంలోని చాలా ప్రాంతాల్లో, కృష్ణ, గోదావరి బేసిన్లలో వర్షాలు తక్కువగా కురుస్తాయి. పసిఫిక్ మహా సముద్రంలో ఏర్పడ్డ ఎల్ నినో ప్రభావంతో ఆగస్టు నెలలో తీవ్ర వర్షాభావం కొనసాగుతోంది. ఎల్ నీనో ప్రభావంతో పగటి పూట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 1.5 డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి.
తెలంగాణలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు..
ఎల్ నీనో ప్రభావంతో తెలంగాణలో సైతం ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. నిత్యం సాధారణం కంటే 4 డిగ్రీల ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి. కరెంటు వినియోగం పెరిగి రికార్డులు నెలకొల్పుతోంది. ఆగస్టు 28న హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది.