నెలకు రూ. 100 కోట్ల కరెంట్ చోరీ

నెలకు రూ. 100 కోట్ల కరెంట్ చోరీ
  • పాత బస్తీ తర్వాత అక్కడే ఎక్కువ.. విద్యుత్​ సంస్థల ఆడిట్​లో వెల్లడి
  • ఆస్మాన్ ఘడ్​లో 39%, చార్మినార్​లో 38%, గజ్వేల్‌‌‌‌లో 35.5%, సిద్దిపేటలో 32.31% నష్టాలు

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: విద్యుత్ సంస్థలు చేసే కరెంటు సరఫరాకు,నెల నెలా కరెంటు బిల్లుల్లో నమోదవుతున్న యూనిట్లకు మధ్య చాలా తేడా కనిపిస్తున్నది. రోజుకు లక్షలాది యూనిట్ల కరెంటు లెక్కాపత్రం లేకుండా పోతున్నది. హైదరాబాద్​ పాతబస్తీలోని ఆస్మాన్​ఘడ్, చార్మినార్​ డివిజన్ల తర్వాత గజ్వేల్, సిద్దిపేటలో ఎక్కువగా కరెంట్​ లాస్​ అవుతున్నట్లు విద్యుత్​ సంస్థల ఎనర్జీ ఆడిట్​లో తేలింది. ఆస్మాన్ ఘడ్ డివిజన్ పరిధిలో 39 శాతం, చార్మినార్ డివిజన్ లో 38 శాతం, గజ్వేల్‌‌‌‌లో 35.5 శాతం, బేగంబజార్​లో 35 శాతం, సిద్దిపేటలో 32.31 శాతం,  మెహిదీపట్నంలో 22 శాతం కరెంట్​ నష్టాలు వస్తున్నట్లు వెల్లడైంది. ఇందులో కొంత శాతాన్ని సాంకేతిక నష్టాలుగా తీసేసినా.. మిగతాది ఎటుపోతున్నదనేదానిపై అధికారులు ఆరా తీస్తున్నారు. అయితే.. హైదరాబాద్​లోని పలు ప్రాంతాల్లో మీటర్ ట్యాంపరింగ్, అక్రమ కనెక్షన్ల వల్ల లాస్​ వస్తున్నదని అంటున్నారు.

గ్రేటర్​ హైదరాబాద్​లో 50లక్షల యూనిట్లు గాయబ్​
ఒక్క గ్రేటర్​ హైదరాబాద్‌‌‌‌లోనే రోజుకు 50 లక్షల యూనిట్ల కరెంటు మాయం అవుతున్నట్లు వెల్లడైంది. గ్రేటర్​ పరిధిలో రోజుకు  56 మిలియన్ యూనిట్ల విద్యుత్ సరఫరా జరుగుతుంటే.. బిల్లింగ్‌‌‌‌ లెక్కల్లో మాత్రం 51 మిలియన్ యూనిట్లుగా వస్తున్నది. 5 మిలియన్​ యూనిట్లు.. అంటే 50 లక్షల యూనిట్ల విద్యుత్ లెక్కలోకి రాకుండా పోతున్నది. నిరుడు జులై, ఆగస్టు, సెప్టెంబర్ మూడు నెలలకు సంబంధించిన ‘క్వార్టర్లీ ఎనర్జీ  ఆడిట్‌‌‌‌’లో  ఈ విషయం వెల్లడైంది. గ్రేటర్​ హైదరాబాద్​లో నెలకు రూ. 100 కోట్ల చొప్పున ఏడాదికి రూ. 1,200 కోట్ల విద్యుత్‌‌‌‌ చౌర్యం జరుగుతున్నట్లు విద్యుత్‌‌‌‌ ఆడిట్‌‌‌‌ నివేదికల ద్వారా తేలింది. గృహ విద్యుత్​ కోసమని కనెక్షన్ తీసుకొని కమర్షియల్‌‌‌‌‌‌‌‌కు వాడుకోవడం, మీటర్ ట్యాంపరింగ్​,  అక్రమ కనెక్షన్ల వల్ల విద్యుత్​ లాస్​ అవుతున్నట్లు తెలుస్తున్నది. ప్రతి యాభై విద్యుత్​ కనెక్షన్లలో ఒకటి అక్రమ కనెక్షన్​ ఉన్నట్లు బయటపడింది. అక్రమ కనెక్షన్ల విషయంలో విద్యుత్​ సిబ్బంది చూసిచూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల మణికొండ చిత్రపురి కాలనీలో భారీ భవనాల నిర్మాణాలకు కరెంట్ వాడుతున్నా  ఆ కన్​స్ట్రక్షన్​ కంపెనీకి 15 నెలలుగా సున్నా బిల్లింగ్ వచ్చింది.