- హైదరాబాద్ సిటీలో మకాం వేసిన అంతర్రాష్ట్ర ముఠాలు
- ఒంటరి మహిళలే టార్గెట్గా రెక్కీ, పట్టపగలే దోపిడీ
- అడ్డొస్తే దాడులు, హత్యలకూ వెనుకాడట్లే
- చోరీ చేసిన, నంబర్ ప్లేట్లులేని బైకులతో చైన్స్నాచింగ్లు
- సీసీ కెమెరాలకు చిక్కుతున్నా పట్టుకోలేకపోతున్న పోలీసులు
- సంక్రాంతి తర్వాత పెద్దసంఖ్యలో దొంగతనాలు జరిగినా
- ఒక్కరూ చిక్కలే.. బాధితుల ఆభరణాలూ రికవరీ కావట్లే
హైదరాబాద్, వెలుగు: రోజురోజుకూ పెరుగుతున్న బంగారం, వెండి ధరలు.. మహిళకు ప్రాణాంతకంగా మారుతున్నాయి. తులం బంగారం రూ.1.61 లక్షలకు చేరడంతో అంతర్రాష్ట్ర ముఠాలతోపాటు స్థానిక దొంగలు మహిళలను లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఒక్క స్నాచింగ్ చేస్తే తక్కువలో తక్కువ రూ.2 నుంచి రూ.3 లక్షల దాకా చేతికి అందుతుండడంతో చైన్స్నాచర్లు రెచ్చిపోతున్నారు. బైకులపై మెరుపు వేగంతో వచ్చి ఇంటి ముందు ముగ్గులు వేస్తున్న మహిళలుసహా రోడ్డుపై నడిచివెళ్లే వారి మెడలోంచి పుస్తెల తాళ్లు, చైన్లు తెంపుకెళ్తున్నారు. పట్ట పగలే రెచ్చిపోతున్న దొంగలు.. అడ్డొస్తే హత్య చేసేందుకూ వెనుకాడడం లేదు.
ముఖ్యంగా ఒంటరి, వృద్ధ మహిళలను టార్గెట్చేసి చంపి మరీ బంగారం ఎత్తుకెళ్తున్నారు. ఇలాంటి కేసుల్లో ఎక్కువగా తెలిసినవాళ్లే ఘాతుకాలకు పాల్పడుతున్నారు. సంక్రాంతి తర్వాత రాష్ట్రవ్యాప్తంగా కనీసం 30కిపైగా చైన్స్నాచింగ్లు నమోదు కాగా, నల్గొండ జిల్లాలో తాజాగా బంగారం కోసం ఓ వృద్ధురాలిని హత్యచేయడం కలకలం రేపింది. దీంతో ఒంటరి మహిళలు జాగ్రత్తగా ఉండాలని, ప్రస్తుతం జరుగుతున్న జాతరలకు ఎట్టి పరిస్థితుల్లోనూ బంగారు నగలు వేసుకొని వెళ్లకూడదని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
రాష్ట్రంలో ప్రతిరోజూ ఏదో ఒక చోట చైన్ స్నాచింగ్లు జరుగుతున్నాయి. దీంతో ఒంటిపై బంగారం వేసుకొని బయటకు వెళ్లేందుకు మహిళలు జంకుతున్నారు. ఇటీవల హైదరాబాద్లో చైన్ స్నాచర్లు రెచ్చిపోతున్నారు. సంక్రాంతి తర్వాత 8 చోట్ల చైన్ స్నాచింగ్లకు పాల్పడ్డారు. ఎల్బీనగర్, చైతన్యపురి, హయత్నగర్ కుంట్లూరులో గంట వ్యవధిలోనే మూడు చోట్ల మహిళల మెడలోంచి గొలుసులు, పుస్తెల తాళ్లు తెంపుకెళ్లారు. సింద్రాబాద్ గోపాలపురంలో పల్సర్ బైక్ను చోరీ చేసిన ఇద్దరు దొంగలు ముఖానికి మాస్కులు ధరించి వరుస చైన్ స్నాచింగ్లకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. సిటీలో రాత్రి పూట షాపింగ్కు వెళ్లి వస్తున్న, కాలనీ రోడ్లపై నడుస్తున్న ఒంటరి మహిళలతోపాటు బైక్ వెనుక కూర్చున్న వారిని కూడా చైన్స్నాచర్లు వదలట్లేదు.
ఇక గ్రామీణ ప్రాంతాల్లో ఒంటరిగా కూలిపనులకు వెళ్లి వచ్చే మహిళలను దొంగలు టార్గెట్చేస్తున్నారు. ముఖానికి మాస్కులు ధరించి వస్తున్న దొంగలు రెప్పపాటులో మాయమయ్యేందుకు స్పోర్ట్స్ బైక్స్ను వాడుతున్నారు. పట్టుకునేందుకు యత్నించే వారిపై కత్తులు, రాళ్లతో దాడులకు తెగబడుతున్నారు. ఇక కొన్నిచోట్ల ఒంటరి మహిళల విషయంలో చుట్టుపక్కలవారే దారుణాలకు ఒడిగడ్తున్నారు.
గంజాయి, బెట్టింగులు, జల్సాలకు బానిసలైనవారు ఈజీ మనీ కోసం వృద్ధులను టార్గెట్చేసి బంగారం ఎత్తుకెళ్తున్నారు. ఈ క్రమంలో హత్యలకూ పాల్పడుతున్నారు. ఇలా సంక్రాంతి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో చైన్ స్నాచింగ్స్ జరిగినా పోలీసులకు ఒక్కరంటే ఒక్క దొంగ కూడా చిక్కలేదు. వీటితోపాటు ఉప్పల్ మేడిపల్లిలో సంక్రాంతి రోజు 8 ఇండ్లలో జరిగిన దోపిడీలకు పాల్పడిన దొంగలను పోలీసులు ఇప్పటివరకూ కనిపెట్టలేకపోయారు.
సీసీటీవీ కెమెరాలకు చిక్కినా.. చేతులెత్తేస్తున్నరు..
దేశంలో ఎక్కడాలేని అడ్వాన్స్డ్ టెక్నాలజీ వినియోగిస్తున్నామని రాష్ట్ర పోలీసులు తరుచూ చెప్పుకుంటారు. దేశంలో ఉన్న మొత్తం సీసీటీవీ కెమెరాల్లో 60 శాతం హైదరాబాద్ నగరంలోనే ఉండగా, కమాండ్కంట్రోల్ సెంటర్ నుంచి నిరంతర పర్యవేక్షణ ఉంటున్నది.
ఏదైనా నేరం జరిగితే గంటల వ్యవధిలోనే ఛేదించే స్పెషల్ పోలీస్ వ్యవస్థ ఉంది. కానీ ఇవేవీ చైన్ స్నాచర్లకు అడ్డుకట్ట వేయడం లేదు. ప్రధానంగా అంతర్రాష్ట్ర దొంగల ముఠాలు గ్రేటర్ హైదరాబాద్లో రెక్కీలు వేసి మరీ చోరీలు చేస్తున్నాయి. హై టెక్నాలజీ సీసీటీవీ కెమెరాలు ఉన్నా.. పట్టుకోండి చూద్దామంటూ పోలీసులకు సవాల్ విసురుతున్నాయి.
సీసీటీవీ కెమెరాల నిర్వహణ లోపాలు, రాత్రి సమయాల్లో బైక్ నంబర్లను గుర్తించే నైట్ విజన్ లేకపోవడం చైన్ స్నాచర్లకు కలిసివస్తున్నది. స్నాచర్లు మాస్క్లు ధరించి ఉండడం, బైక్ నంబర్ ప్లేట్స్ సరిగా కనిపించకపోవడం సమస్యగా మారింది.
ఒకవేళ నంబర్ ప్లేట్ గుర్తించినప్పటికీ.. అవి దొంగిలించిన బైకులు.. లేదంటే ఫేక్ నంబర్ ప్లేట్లు కావడంతో పోలీసుల దర్యాప్తు ముందుకు సాగడంలేదు. దీంతో అనుమానితులు, పాతనేరస్తులను విచారిస్తున్నారు తప్ప.. అసలు దొంగలను పట్టుకోలేక చేతులెత్తేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి.. దొంగలు దొరకకపోవడం వల్ల బాధితుల బంగారం కూడా రికవరీ కావట్లేదు.
జనవరి 6: మహబూబ్ నగర్ జిల్లా లక్ష్మీనగర్ కాలనీలో సుందరి అనే మహిళ కరెంటు బిల్లు కట్టేందుకు మెట్టుగడ్డ సమీపంలోని కరెంటు ఆఫీస్కు వెళ్లింది. బిల్లు కట్టి తిరిగి వస్తున్న సమయంలో ఇద్దరు వ్యక్తులు ఆమెను అడ్డగించారు. పోలీసులమని చెప్పి నమ్మించారు. మెడలో నుంచి 4.5 తులాల బంగారు పుస్తెల తాడును తీయించి సంచిలో పెట్టినట్లు నటించారు. తర్వాత చూస్తే సంచిలో పుస్తెల తాడు ఉన్న కవర్కు బదులు.. గులకరాళ్ల కవర్ ఉన్నట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
జనవరి 12: భర్త చేసిన అప్పులు తీర్చేందుకు అనితారెడ్డి అనే యువతి చైన్ స్నాచింగ్కు పాల్పడింది. మియాపూర్లోని ఓ అపార్ట్మెంట్ లిఫ్ట్లో నల్ల కమల అనే వృద్ధురాలి మెడలోని మంగళసూత్రం, నల్లపూసల గొలుసును తెంపేందుకు ప్రయత్నించింది. చేతికందిన అర తులం నల్లపూసల గొలుసుతో పరారైంది.
జనవరి 3: హైదరాబాద్లోని మియాపూర్ బీరంగూడకు చెందిన అంకం ప్రీతి(25) రాత్రి 9.25 గంటల సమయంలో టిఫిన్ చేసేందుకు మదీనగూడ వెళ్లింది. తల్లితో కలిసి రోడ్డుపై నడుచుకుంటూ వస్తున్నది. అదే సమయంలో బైక్పై వేగంగా వచ్చిన దుండగుడు ప్రీతి మెడలోని 13 గ్రాంల గోల్డ్ చైన్ తెంపుకెళ్లాడు. సీసీటీవీల్లో నంబర్ ప్లేట్ సరిగా రికార్డ్ కాలేదని పోలీసులు చేతులెత్తేశారు.
జనవరి 9 :హైదరాబాద్లో వివిధ చోట్ల..
ఉదయం 7.50 గంటలు: హయత్నగర్ కుంట్లూరు రోడ్డులో నడుచుకుంటూ వెళ్తున్న విజయ మెడలోని 3 తులాల పుస్తెలతాడు స్నాచింగ్
ఉదయం 8.30 గంటలు: నాగోల్ అంధుల కాలనీకి చెందిన మణెమ్మ మెడలోని 2.5 తులాల బంగారు గొలుసును తెంపుకెళ్లారు
ఉదయం 9 గంటలు : కొత్తపేట న్యూమారుతీ నగర్కు చెందిన ఆదిలక్ష్మి మెడలోంచి 3 తులాల పుస్తెలతాడు స్నాచింగ్కు ప్రయత్నించగా గట్టిగా పట్టుకుంది. సగం గొలుసు తెంపుకొని పారిపోయారు.
జనవరి 13: అబ్దుల్లాపూర్ బాటసింగారంలో ఉదయం 9 గంటలకు జయలక్ష్మి అనే మహిళ మెడలో 2.5 తులాల బంగారు చైన్ లాక్కెల్లారు.
జనవరి19: ఆసిఫాబాద్ జిల్లా కేంద్రం గుండి రోడ్డులోని సాయినగర్ కాలనీలో బైక్ పార్కింగ్ చేసుకుంటామని నమ్మించి.. అద్దె ఇంట్లో ఉంటున్న అంజలి అనే గృహిణి మెడలో 3 తులాల బంగారు గొలుసును లాక్కొని దొంగలు పరారయ్యారు.
జగిత్యాల జిల్లాలో..
జనవరి20: జగిత్యాల జిల్లా మెట్పల్లి మార్కెట్ ఏరియాకు చెందిన వెన్నెల గంగు(63) కొడుకు రవి తో కలిసి దోబీఘాట్ వద్ద బట్టలు ఉతుకుతున్నది. అదే సమయంలో బైక్పై వచ్చిన ఇద్దరు దొంగలు.. గంగు, ఆమె కొడుకు రవిపై బండ రాళ్లలో దాడి చేశారు. గంగు మెడలో ఉన్న బంగారు పుస్తెలతాడు, చెవి కమ్మలు లాక్కొని పారిపోయారు.
జనవరి 24: మెట్పల్లిలోని దుబ్బవాడలో నివసిస్తున్న కోటలక్ష్మి ఉదయం ఇంటి ముందు పనులు చేస్తుండగా బైక్పై వచ్చిన స్నాచర్ దాడి చేశాడు. మెడలో ఉన్న 3 తులాల పుస్తెల తాడు తెంపుకుని పారిపోయాడు.
నిజామాబాద్ జిల్లాలో..
జనవరి 2: నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం గడ్కోల్లో పొలం పనులు చేస్తున్న బుచ్చవ్వ మెడలో నుంచి 3 తులాల బంగారు గొలుసు ఎత్తుకెళ్లారు.
జనవరి19: నిజామాబాద్ జక్రాన్ పల్లి మండలం సికింద్రాపూర్ విలేజ్లో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న మమత అనే మహిళ కళ్లల్లో కారం చల్లి 2 తులాల బంగారు గొలుసు లాక్కెళ్లారు.
డిసెంబర్10: నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని వినాయకనగర్లో ఇంటి ముందు వాకిలి ఊడుస్తున్న బాలిశెట్టి బాగిర్తి అనే మహిళ మెడలోంచి 3 తులాల గోల్డ్చైన్ తెంపుకెళ్లారు.
డిసెంబర్ 20: నిజామాబాద్ జిల్లా దుబ్బకాలనీకి చెందిన మహిళ వసంత రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా బైక్పై వచ్చిన ఇద్దరు 2 తులాల గొలుసు ఎత్తుకెళ్లారు.
డిసెంబర్ 25: కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం పొల్కంపేటలో నరేంద్రుల సులోచన(69) వృద్ధురాలు ఇంట్లో ఒంటరిగా ఉండగా హత్య చేశారు. ఆమె మెడలో ఉన్న 4 తులాల బంగారం ఆభరణాలు దోపిడీ చేశారు. ఈ కేసులో అదే గ్రామానికి చెందిన ముద్రబోయిన కుమార్ను పోలీసులు అరెస్ట్ చేశారు.
జనవరి 4: ఆదిలాబాద్ పట్టణంలోని కుమార్పేట్కు చెందిన తోట లత ఉదయం ఇంటి ముందు ముగ్గు వేస్తుండగా హెల్మెట్ ధరించిన ఇద్దరు దుండగులు ఆమె మెడలో నుంచి చైన్ లాక్కెళ్లారు. వెనక కూర్చున్న వ్యక్తిని పట్టుకునేందుకు ప్రయత్నించి.. ఆమె కింద పడి గాయాలపాలైంది. వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసింది.
