మహారాష్ట్రలో భారీ ఎన్​కౌంటర్​

మహారాష్ట్రలో భారీ ఎన్​కౌంటర్​
  • మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లాలో ఎన్​కౌంటర్​
  • 26 మంది మావోయిస్టులు మృతి
  • మృతుల్లో మిలింద్ బాబూరావు తెల్తుంబ్డే సహా 12 మంది కీలక నేతలు!
  • కాల్పులతో దద్దరిల్లిన దండకారణ్యం
  • మూడు వైపులా మావోయిస్టులను ముట్టడించిన పోలీసులు
  • 4 గంటలు కొనసాగిన ఎన్‌‌కౌంటర్
  • నలుగురు పోలీసులకు గాయాలు.. నాగ్‌‌పూర్‌‌‌‌కు తరలించి చికిత్స
  • చత్తీస్​గఢ్​, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్ర సరిహద్దుల్లో రెడ్ అలర్ట్
  • అడవిలోకి అదనపు బలగాలు.. కొనసాగుతున్న గాలింపు

భద్రాచలం, వెలుగు: దండకారణ్యం కాల్పులతో దద్దరిల్లింది. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో భారీ ఎన్‌‌కౌంటర్‌‌‌‌ జరిగింది. 26 మంది మావోయిస్టులు చనిపోయారు. వీరిలో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు, భీమా–కోరెగావ్ అల్లర్ల కేసులో నిందితుడు మిలింద్ బాబూరావు తెల్తుంబ్డే సహా 12  మంది కీలక నేతలు ఉన్నట్లు సమాచారం. ఎదురుకాల్పుల్లో నలుగురు పోలీసులు కూడా తీవ్రంగా గాయపడ్డారు. పోలీస్ టీమ్స్.. నక్సల్స్ శిబిరాలను ధ్వంసం చేసి, అక్కడి నుంచి భారీ సంఖ్యలో ఆయుధాలను స్వాధీనం చేసుకున్నాయి. తప్పించుకుపోయిన నక్సల్స్‌‌ను పట్టుకునేందుకు మరిన్ని బలగాలు అడవిలో జల్లెడ పడుతున్నాయి. ముందు జాగ్రత్తగా సరిహద్దు రాష్ట్రాలకు రెడ్ అలర్డ్ ప్రకటించారు. ఎన్‌‌కౌంటర్ వివరాలను గడ్చిరోలి ఎస్పీ అంకిత్‌‌ గోయల్ వెల్లడించారు.

పక్కా సమాచారంతో..
మహారాష్ట్ర, చత్తీస్‌‌గఢ్‌‌ సరిహద్దుల్లో పెద్ద సంఖ్యలో మావోయిస్టులు సమావేశమైనట్లు బలగాలకు పక్కా సమాచారం అందింది. దీంతో శనివారం సీ–60 పోలీస్ కమాండో టీమ్‌‌తోపాటు స్థానిక పోలీసులు కూంబింగ్‌‌ చేపట్టారు. గడ్చిరోలి జిల్లా ధనిరా తాలూకా గ్యారబట్టి అటవీ ప్రాంతంలోకి అడిషనల్ ఎస్పీ సౌమ్యా ముండే ఆధ్వర్యంలో సీ-60 బలగాలు వెళ్లాయి. కోర్చి–మార్డింటోలా ఫారెస్ట్ వైపు నుంచి మాన్‌‌పూర్ అడిషనల్ ఎస్పీ పుల్పేశ్‌‌ కుమార్ ఆధ్వర్యంలో కొన్ని బలగాలు.. మోహ్లా బ్లాక్‍లోని హిడోకోటోలా ఫారెస్ట్‌‌లోని రాన్‍కట్టా–మార్దిన్‌‌ గ్రామాల మీదుగా మరికొన్ని బలగాలు.. మూడువైపుల నుంచి మావోయిస్టులు బస చేసిన ప్రాంతానికి చేరుకున్నాయి. శిబిరాలు నిర్మించుకుని, సమావేశ ఏర్పాట్లలో ఉన్న మావోయిస్టులు.. భద్రతాబలగాలు తమను చుట్టుముట్టడాన్ని గమనించారు. వెంటనే తేరుకుని ఫైరింగ్ ప్రారంభించారు. దీంతో అడవి కాల్పుల మోతతో దద్దరిల్లింది. నాలుగు గంటల పాటు ఏకధాటిగా కాల్పులు జరిగాయి. ఎన్‌‌‌‌‌కౌంటర్‌‌‌‌లో దాదాపు 26 మంది మావోలు చనిపోయారు. మావోయిస్టుల కాల్పుల్లో నలుగురు సీ-60 టీమ్ పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని హెలికాప్టర్ ద్వారా నాగ్‍పూర్‍కు తరలించి చికిత్స అందిస్తున్నారు.

మృతుల్లో అగ్రనేతలు
గ్యారబట్టి ఎన్‍కౌంటర్‌‌‌‌లో మృతి చెందిన వారిలో 12 మంది అగ్రనేతలు ఉన్నట్లుగా గడ్చిరోలి ఎస్పీ అంకిత్ గోయల్ చెప్పారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన భీమా‑కోరెగావ్ అల్లర్ల కేసులో నిందితుడు మిలింద్ బాబూరావు తెల్తుంబ్డే ఉన్నట్లు చెప్పారు. మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉన్న మిలింద్.. భీమా‑కోరెగావ్ అల్లర్ల కేసులో పుణె పోలీసుల వాంటెడ్ లిస్టులో ఉన్నారు. దీపక్‌‌ తెల్తుంబ్డే, చత్తీస్‍గఢ్​ స్పెషల్ జోనల్ సెక్రటరీ, జిల్లా కమిటీ సభ్యుడు శుల్కాలాల్‍తో సహా పలువురు కీలక నేతలు చనిపోయినట్లు మహారాష్ట్ర పోలీసులు పేర్కొంటున్నారు.

అడవిలోకి అదనపు బలగాలు
ఎన్‍కౌంటర్ తర్వాత మిగిలిన నక్సల్స్ పారిపోయారు. దీంతో వారి కోసం అదనపు బలగాలను పోలీసులు అడవిలోకి పంపించారు. మహారాష్ట్ర, చత్తీస్‍గఢ్‍, తెలంగాణ, ఆంధ్ర సరిహద్దుల్లో రెడ్‍అలర్ట్ ప్రకటించారు. పారిపోయిన నక్సల్స్ ఆయా రాష్ట్రాల సరిహద్దుల్లోకి వచ్చే అవకాశం ఉందని నిఘా వర్గాలు చెప్పాయి. ప్రతీకార దాడులకు కూడా పాల్పడే ప్రమాదం ఉందని, అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరించాయి. మే 21న గడ్చిరోలి జిల్లాలోనే ఏటపల్లి అటవీ ప్రాంతంలో మావోయిస్టులు, సీ60 బలగాల మధ్య ఎన్‍కౌంటర్‌‌ జరిగింది. అప్పుడు 13 మంది మావోయిస్టులు చనిపోయారు. ఆ తర్వాత ఇదే పెద్ద సంఘటన.

డెడ్‌‌బాడీల తరలింపు.. దాడుల భయం
ఎన్‍కౌంటర్‍ జరిగిన ప్రదేశం దట్టమైన దండకారణ్యం కావడం, 26 మంది మావోయిస్టులు చనిపోవడంతో.. రికవరీ చేసిన ఆయుధాలు, మృతదేహాల తరలింపు భద్రతా బలగాలకు సవాలుగా మారింది. ఒకవైపు డెడ్‌‌బాడీలు, ఆయుధాలను తరలిస్తూనే మరోవైపు మావోయిస్టుల నుంచి తమను తాము కాపాడుకుంటూ బలగాలు ముందుకు సాగుతున్నాయి. మావోయిస్టులు, వారి సానుభూతిపరులు, మిలీషియా సభ్యులకు పట్టున్న ప్రాంతం కావడంతో.. సాయంగా వెళ్లిన అదనపు బలగాలు మిగతా వారికి రక్షణ కల్పిస్తున్నాయి.