Mumbai Rains: ఎండాకాలం ఈ వానలేంటయ్యా.. ముంబైలో ఎటు చూసినా రోడ్లపై మోకాలి లోతు నీళ్లు

Mumbai Rains: ఎండాకాలం ఈ వానలేంటయ్యా.. ముంబైలో ఎటు చూసినా రోడ్లపై మోకాలి లోతు నీళ్లు

ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబై నగరం సోమవారం తెల్లవారుజాము నుంచి భారీ వర్షాలకు తడిసి ముద్దయింది. కుండపోతగా కురిసిన వర్షానికి రోడ్లపై ఎటు చూసినా మోకాలి లోతు నీళ్లు కనిపించాయి. కుర్లా, సియాన్, దాదర్, పరేల్ ప్రాంతాల్లో వీధులు సముద్రాన్ని తలపించాయి. లోకల్ ట్రైన్స్ సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వాతావరణం అనుకూలించకపోవడంతో పలు విమానాలు ఆలస్యంగా రాకపోకలు సాగించాయి.

ఉదయం 9 నుంచి 10 గంటల మధ్యలో ముంబైలోని నారిమన్ పాయింట్ ఫైర్ స్టేషన్ ప్రాంతంలో అత్యధికంగా 104 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఒక్క గంటలోనే ఇంత వర్షం కురవడంతో ఆ ప్రాంత ప్రజలు నానా అవస్థలు పడ్డారు. సోమవారం ఉదయం కావడంతో ఆఫీస్లకు వెళ్లే ఉద్యోగులు ట్రాఫిక్ జాంలో మోకాలి లోతు నీళ్లలో ఇరుక్కుని వాహనాలు ముందుకు కదలక నరకం చూశారు. రైల్వే ట్రాకులు నీళ్లలో మునిగిపోవడంతో రైళ్లు నెమ్మదిగా ముందుకు సాగుతున్నాయి. 107 ఏళ్ల క్రితం రికార్డును ముంబైలో సోమవారం కురిసిన వర్షం తిరగరాసింది. ముంబై నగరంలో సోమవారం ఉదయం 135 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.

ఇక.. దేశ రాజధాని ఢిల్లీలో కూడా ఆదివారం రోజు వాన దంచికొట్టింది. ఉరుములు మెరుపులు, బలమైన గాలులతో భారీ వర్షం కురిసింది. శనివారం రాత్రి 11:30 గంటల నుంచి ఆదివారం తెల్లవారుజామున 5:30 గంటల వరకు కుండపోత కురిసింది. అత్యధికంగా సఫ్దర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గంజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 8.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. పుసాలో 7.1, పాలెంలో 6.81, మయూర్ విహార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 4.8 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం రికార్డయింది.

భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. మోతీబాగ్, మింటో రోడ్, ఐటీవో, ధౌలా కువాన్, కంటోన్మెంట్, దీన్ దయాల్ ఉపాధ్యాయ మార్గ్, చాణక్యపురి తదితర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున వరద చేరింది. కొన్నిచోట్ల అండర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల వద్ద బస్సులు, కార్లు వరదలో చిక్కుకుపోయాయి. గంటకు 60 నుంచి 82 కి.మీ. వేగంతో గాలులు వీయడంతో చెట్లు పడిపోయాయి. కరెంట్స్ పోల్స్ విరిగిపడ్డాయి.