మరో ఐదు రోజులు జోరు వానలు.. ఈ జిల్లాల్లో కుండపోత వర్షాలకు చాన్స్.. ఎల్లో అలర్ట్ జారీ

మరో ఐదు రోజులు జోరు వానలు.. ఈ జిల్లాల్లో కుండపోత వర్షాలకు చాన్స్.. ఎల్లో అలర్ట్ జారీ

రుతుపవనాలు చురుగ్గా కదులుతుండటం, ఉపరితల ఆవర్తనం కొనసాగుతుండటంతో తెలంగాణ వ్యాప్తంగా జోరుగా వానలు కురుస్తున్నాయి. ఈ సారి రోహిణి కార్తెలోనే నైరుతి రుతుపవనాలు ప్రవేశించి ముందస్తు వానలు కురిశాయి. ఆ తర్వాత కొన్నాళ్లు మళ్లీ ఎండలు దంచికొట్టాయి. అయితే గత రెండు మూడు రోజులుగా మళ్లీ వానలు జోరందుకున్నాయి. 

రాష్ట్రంలో రుతుపవనాలు చురుగ్గా కదులుతుండటంతో తెలంగాణ వ్యాప్తంగా మరో ఐదు రోజులు వర్షాలు విస్తారంగా కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు , అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్లు అధికారులు తెలిపారు.

ఇవాళ (జూన్ 13)పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. నిజామాబాద్, నల్గొండ, సూర్యాపేట, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాలకు  ఎల్లో అలెర్ట్ ప్రకటించారు.

అదే విధంగా ఉరుములు, మెరుపులతో పాటు ఈదురు గాలులు (గాలి వేగం గంటకు 40-50 కి.మీ)తో  కూడిన వర్షాలు తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాలలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని తెలిపారు.  ఈదురు గాలులు,  ఉరుములు మెరుపుల పాటు  పిడుగులు పడే అవకాశం ఉండటంతో  ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు.

ఇక ఇవాళ (శుక్రవారం, జూన్ 13) హైదరాబాద్ నగరంలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు  అక్కడక్కడ భారీ వర్షం నమోదయ్య అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఇప్పటికే గురువారం (జూన్ 12) సాయంత్రం నుంచి రాత్రంతా హైదరాబాద్ నగరంలో భారీ వర్షాలు కురిశాయి. ఉరుములు, మెరుపులతో నగర వాసులు ఉలిక్కి పడ్డారు. భారీ శబ్దాలతో వచ్చిన ఉరుములకు నగర వాసులు రాత్రి 9 గంటలకే ఇళ్లల్లోకి చేరిపోయారు. ఇదే వర్షం మరో ఐదు రోజులు కొనసాగుతుందని వాతావరణ కేంద్రం తెలిపింది.