సీఎం కేసీఆర్ మహారాష్ట్ర ర్యాలీతో పంజాగుట్ట నుంచి మియాపూర్ వరకు భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. దాదాపు 20 కి.మీ వరకు వాహనాలను నిలిపివేశారు ట్రాఫిక్ పోలీసులు. కేసీఆర్ ప్రగతి భవన్ నుంచి బయల్దేరినప్పటి నుంచి మియాపూర్ దాటే వరకు వాహనాలను ఆపేశారు.
వన్ సైడ్ పూర్తిగా వాహనాలను నిలిపివేయడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గంటల తరబడి ఆపేయడంతో అంబులెన్స్ లు ట్రాఫిక్ లోనే చిక్కుకుపోయాయి. ఆఫీసులు, హాస్పిటళ్లకు వెళ్లే వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ట్రాఫిక్ క్లియర్ కావడానికి రెండు మూడు గంటలు పడుతోందని వాహనదారులు చెబుతున్నారు.
సీఎం కేసీఆర్ మహారాష్ట్ర పర్యటనకు ప్రగతి భవన్ నుంచి 600 కార్లు, 2 వేల మందితో భారీ కాన్వాయ్ బయల్దేరారు. పంజాగుట్ట, అమీర్ పేట,మియాపూర్ మీదుగా సంగారెడ్డి, జహీరాబాద్ నుంచి మహారాష్ట్రకు వెళ్తారు. కేసీఆర్ వెంట ఎంపీలు, ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు ఉన్నారు.
సీఎం కేసీఆర్ మహారాష్ట్రలో రెండు రోజులు పర్యటించనున్నారు. ఇవాళ షోలాపూర్ లో అక్కడి బీఆర్ఎస్ నేతలు, తెలంగాణకు చెందిన చేనేత కార్మికులతో సమావేశమవుతారు. రాత్రికి సోలాపూర్ లో బస చేస్తారు. జూన్ 27న పండరీపూర్ లో ప్రత్యేక పూజలు చేయనున్నారు. అనంతరం మహారాష్ట్రకు చెందిన పలువురు నేతలు కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరుతారు. తిరుగు ప్రయాణంలో దారాశివ్ జిల్లాలోని తుల్జాభవాని ఆలయంలో కేసీఆర్ పూజలు చేస్తారు. మహారాష్ట్రలో బీఆర్ఎస్ కార్యకలాపాలు ప్రారంభించిన తర్వాత కేసీఆర్ ఆ రాష్ట్రానికి వెళ్లడం ఇది ఐదోసారి