హైదరాబాద్ పరువు హత్య.. నిన్న ఏం జరిగిందో కళ్లకుకట్టినట్లు చెప్పిన అవంతి

హైదరాబాద్ పరువు హత్య.. నిన్న ఏం జరిగిందో కళ్లకుకట్టినట్లు చెప్పిన అవంతి
  • నా అత్తమామల బాధ్యత నాదే..
  • హేమంత్‌ని చంపినవాళ్లను కఠినంగా శిక్షించాలి

మిర్యాలగూడ తరహా పరువు హత్య హైదరాబాద్‌లో కూడా జరిగింది. గురువారం జరిగిన ఈ పరువు హత్య నగరంలో కలకలం సృష్టించింది. కూతురు ప్రేమించి పెళ్లి చేసుకుందనే కోపంతో యువతి తండ్రి బంధువలతో కలిసి అల్లుడిని హత్య చేశాడు. చందానగర్‌కు చెందిన అవంతి, హేమంత్ కొన్నాళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమకు యువతి తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడంతో.. ఇంటి నుంచి పారిపోయి జూన్ 10న రిజిష్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. కాగా.. యువతి తండ్రి లక్ష్మారెడ్డి మాత్రం తన కూతురు జూన్ 10 నుంచి కనబడడంలేదని చందానగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే తన కూతురు ప్రేమ పెళ్లి చేసుకోవడాన్ని జీర్ణించుకోలేకపోయిన లక్ష్మారెడ్డి.. అల్లుడు హేమంత్‌ని తీసుకెళ్లి హత్య చేశారు.

తన భర్తను చంపిన వాళ్లను కఠినంగా శిక్షించాలని హేమంత్ భార్య అవంతి కోరుతోంది. తన భర్త ఎప్పుడూ ఎవరినీ ఇబ్బందిపెట్టలేదని.. అలాంటివాడిని ఎందుకు చంపారని ఆమె ప్రశ్నిస్తోంది.

హైదరాబాద్ లో పరువు హత్య | అసలేం జరిగింది? | Hyderabad | V6 News

హైదరాబాద్ లో పరువు హత్యనా భర్తను చంపినవాళ్ళను శిక్షించాలిమా నాన్న నాతో లెటర్ కూడా రాయించుకున్నాడు#Hyderabad #V6News #AvanthiReddy #Hemanth

V6 News यांनी वर पोस्ट केले गुरुवार, २४ सप्टेंबर, २०२०

‘నేను, హేమంత్ ఫోర్త్ క్లాస్ నుంచి ఒకరికొకరం తెలుసు. మేం ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నాం. నిన్న మేం 11 గంటలకు నిద్రలేచాం. ముందురోజు నైట్ చాలా లేట్‌గా పడుకున్నాం. లేచిన తర్వాత 12 గంటలకు బ్రేక్‌ఫాస్ట్ చేశాం. ఆ తర్వాత 2 గంటలకు లంచ్ కోసం వంట చేస్తుండగా.. కొంతమంది వచ్చి డోర్ కొట్టారు. వెళ్లి డోర్ తీయగా.. ఒక పది మంది ఇంట్లోకి వచ్చారు. మీ అమ్మానాన్నలకు దగ్గరకు మిమ్మల్ని తీసుకెళ్లాలి.. మీ పేరెంట్స్‌కి మిమ్మల్ని తీసుకొస్తామని మాట ఇచ్చాం అన్నారు. దాంతో మేం మా కారులో వస్తాం అన్నాం. మేం మీ కారులో రాలేము. కావాలంటే మీరు మా కారుకు ముందు ఒక కారు, వెనక ఒక కారు పెట్టుకోండి అన్నాం. కానీ వాళ్లు మాత్రం మాకు కార్లు లేవా.. మా కారులోనే రండి అన్నారు. మేం ఒప్పుకోకపోవడంతో బలవంతంగా మా ఇద్దరిని కారులోకి లాక్కొని తీసుకెళ్లారు. మా డాడీ వాళ్ల ఇంటికి దగ్గరలో కారును రైట్ సైడ్ కాకుండా..లెఫ్ట్ సైడ్ తిప్పారు. ఓఆర్ఆర్ ఎక్కిన తర్వాత మాకు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. హేమంత్ అప్పటికే మా అత్తమామలకు మెసెజ్ పెట్టాడు. ఓఆర్ఆర్ మీద మేం కార్లలో వెళ్తున్నాం.. మా వెనక హేమంత్ వాళ్ల తల్లిదండ్రులు బైక్ మీద ఫాలో అవుతున్నారు. మాకు అనుమానం వచ్చి వెంటనే కారులోంచి దూకి రోడ్డు మీద పరిగెత్తాం. అయితే ఆ ప్రాంతంలో ఉన్న స్థానికులు మమ్మల్ని పట్టుకొని వారికి అప్పగించాలని చూశారు. కానీ మేం వారికి దొరకకుండా తప్పించుకువెళ్లాం. కానీ మా వెనక నుంచి ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు స్విఫ్ట్ కారులో వేగంగా వచ్చి హేమంత్‌ను తన్ని, కొట్టి బలవంతంగా కారులో తీసుకెళ్లిపోయారు. దాంతో నాకేం చేయాలో అర్థంకాక.. మా అత్తామామల కోసం రోడ్డు మీద వెయిట్ చేశాను. కానీ ఆలోపే మరో రెండు కార్లలో వచ్చిన మిగతావాళ్లు నన్ను కూడా తీసుకెళ్లడానికి ప్రయత్నించారు. కానీ నేను వాళ్లకు దొరకకుండా.. హెల్ప్ హెల్ప్ అంటూ రోడ్డు మీద చెప్పులు లేకుండా పరిగెత్తాను. నా తల్లిదండ్రులు, బంధువులు వచ్చి నన్ను ఇంటికి రమ్మనారు. అయితే హేమంత్ నా కళ్లముందుకు వచ్చిన తర్వాతే వస్తానని వాళ్లను వెళ్లిపోమ్మాను. ఆ తర్వాత కాసేపటికి పెట్రోలింగ్ వెహికల్ వచ్చింది. పెట్రోలింగ్ వెహికల్ కాస్త ముందు వచ్చి ఉంటే ఈ ఘోరం జరిగేది కాదేమో. మమ్మల్ని రోడ్డు మీద తరుముతుంటే.. ఓ ఆటోలో కూర్చొని పారపోవడానికి ప్రయత్నించాం. కానీ మా బంధువులు చెప్పిన మాటలు విని ఆటో వాళ్లు కూడా మాకు సాయం చేయలేదు.

నాకు విజేందర్ రెడ్డి, యుగంధర్ రెడ్డి మేనమామలు. వాళ్లలో విజేందర్ రెడ్డి చాలా క్లోజ్. యుగంధర్ రెడ్డి అంత క్లోజ్ కాదు. నా మీద ఇష్టంతో విజేందర్ రెడ్డి నా కోసం చాలా వెతికాడు. అలాంటిది వాళ్లతో కలిసి మమ్మల్ని ఇలా చేయాలని ఎందుకు అనుకున్నారో అర్థం కావడంలేదు. నా తల్లిదండ్రుల తిట్టినా, కొట్టినా పడేవాళ్లం. కానీ మా బంధువులు కూడా ఇలా చేస్తారని అసలు ఊహించలేదు. వాళ్లకు మా పేరెంట్స్‌కు ఉన్నంత హక్కు ఉండదు కదా. మా పెళ్లికి ముందు హేమంత్ మా పేరెంట్స్ కి కాల్ చేసి అడిగాడు. అప్పుడు మా ఫాదర్ హేమంత్‌ని చాలా బెదిరించాడు. నన్ను కూడా బెదిరించాడు. హేమంత్‌ని పెళ్లి చేసుకుంటే.. విషం తాగి చనిపోతామని బెదిరించారు. మీరు చెప్పిన అబ్బాయినే పెళ్లి చేసుకుంటానని నాతో లెటర్ కూడా రాయించుకున్నారు. నేను ఇంట్లోంచి బయటకు వచ్చే రోజు కూడా నేను ఒక లెటర్ రాసిపెట్టి వచ్చాను. నన్ను హేమంత్ చాలా బాగా చూసుకునే వాడు. నాకు నా తల్లిదండ్రులంటే ప్రేమ ఉన్నప్పటికీ.. వాళ్ల దగ్గరికి వెళ్లాలని ఎప్పుడూ అనిపించలేదు. నేను బయటకు రావడం వల్లే హేమంత్ చనిపోయాడని గిల్ట్‌గా ఫీలవుతున్నాను. నేను అనే దాన్ని లేకపోతే.. ఈ రోజు హేమంత్ తన తల్లిదండ్రులతో సంతోషంగా ఉండేవాడు. హేమంత్ తన తల్లితో చాలా క్లోజ్‌గా ఉండేవాడు. ఇప్పడు వారి బాధ్యత నా మీద ఉంది’ అని అవంతి అంటోంది.

ప్రస్తుతం అవంతి తండ్రి లక్ష్మారెడ్డి, మేనమామ యుగంధర్ రెడ్డితో పాటు రాకేశ్ రెడ్డి, రంజిత్ రెడ్డి, విజయేందర్ రెడ్డి, సందీప్ రెడ్డి, సంతోష్ రెడ్డి, రజిత, స్పందన, స్వప్న, అర్చన పోలీసుల అదుపులో ఉన్నారు. పోస్టుమార్టం నిమిత్తం హేమంత్ మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

For More News..

లాక్డౌన్ తర్వాత సిటీలో రోడ్డెక్కిన బస్సులు

సిటీలో మరో పరువు హత్య.. కూతురుని లవ్ మ్యారెజ్ చేసుకున్నాడని అల్లుడిని చంపించిన మామ

దేశంలో ఒక్కరోజే సుమారు 15 లక్షల కరోనా టెస్టులు