- కాలుష్య పరిశ్రమలపై ఏం చర్యలు తీసుకున్నరు?
- నివేదిక ఇవ్వాలని జీహెచ్ఎంసీ కమిషనర్ కు హైకోర్టు ఆదేశం
హైదరాబాద్, వెలుగు: ‘‘పొల్యూషన్ కాళ్లు కట్టుకుని ఒకేచోట కుదురుగా కూర్చోదు. అధికారులు ఈ విషయాన్ని గుర్తించి మాస్టర్ ప్లాన్లో పర్మిషన్లు లేని ఏరియాల్లోని ఇండస్ట్రీలను మరోచోటకు తరలించాలి. లేకపోతే వాటిని మూసేయాలి’’ అని హైకోర్టు స్పష్టం చేసింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ వంటి ఏరియాల్లో ఇండస్ట్రీ పెడతామంటే అనుమతి ఇస్తారా? పేద, మిడిల్ క్లాస్ ప్రజలు ఉండే కాలనీల్లో ఇండస్ట్రీలు ఉంటే ఎందుకు పట్టించుకోరని అధికారులను ప్రశ్నించింది. హైదరాబాద్లోని టాటానగర్, శాస్త్రిపురం ఏరియాల్లో పరిశ్రమలపై ఏం చర్యలు తీసుకున్నారో రిపోర్టు ఇవ్వాలని జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్ను కోర్టు ఆదేశించింది. శాస్త్రిపురంలో అనధికారికంగా పెట్టిన పరిశ్రమల నుంచి కాలుష్యం వెలువడి ప్రజల ఆరోగ్యం దెబ్బతింటోందని గతంలో దాఖలైన పిల్ను చీఫ్ జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ బి.విజయ్సేన్రెడ్డిల డివిజన్ బెంచ్ బుధవారం మరోసారి విచారించింది. అధికారుల చర్యల కారణంగా కాలుష్యం తగ్గిందని పిటిషనర్ తరఫు న్యాయవాది పుష్పేందర్ కౌర్ చెప్పారు. విచారణను వచ్చే నెల 8కి వాయిదా వేసింది.