- నాలుగు వారాల్లో చెప్పాలంటూ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా అపార్ట్మెంట్లు, ఇతర బహుళ అంతస్తుల భవనాల్లో ఏర్పాటు చేస్తున్న లిఫ్టుల్లో ప్రజల భద్రతకు సంబంధించి చట్టం తీసుకురావాలన్న సర్కారు ప్రతిపాదన ఏ దశలో ఉందో నాలుగు వారాల్లో చెప్పాలంటూ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. లిఫ్ట్ల ఏర్పాటు, నిర్వహణలో నిబంధనలు అమలు చేయకపోవడంతో పలుచోట్ల పిల్లలు, పెద్దలు ప్రాణాలు కోల్పోతున్నారంటూ రాజేంద్రనగర్కు చెందిన బర్కత్ అలీఖాన్ రాసిన లేఖను హైకోర్టు పిల్గా స్వీకరించింది. దీనిపై హైకోర్టు బుధవారం విచారణ చేపట్టింది.
ప్రభుత్వ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. లిఫ్ట్ల భద్రతకు సంబంధించి 2015లో బిల్లు రూపొందిందని తెలిపారు. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా బిల్లును సవరించి 2025లో డ్రాఫ్ట్ బిల్లును రూపొందించి గత సెప్టెంబరులో ప్రభుత్వానికి సమర్పించినట్టు చెప్పారు. దీనిని ప్రభుత్వం పరిశీలించి చట్టం తీసుకువస్తుందని పేర్కొన్నారు.
