- సింగిల్ జడ్జి ఉత్తర్వుల్లో జోక్యానికి హైకోర్టు నిరాకరణ
హైదరాబాద్, వెలుగు: ఖమ్మం జిల్లా వెలుగుమట్లలోని భూదాన్ భూముల్లోని నిర్మాణాల కూల్చివేతలపై సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులపై దాఖలైన అప్పీల్ను విచారణ దశలోనే హైకోర్టు కొట్టివేసింది. వెలుగుమట్ల కూల్చివేతలపై సింగిల్ జడ్జి ఉత్తర్వులను సవాలు చేస్తూ బాధితులు కె.పద్మ మరో 19 మంది హైకోర్టులో దాఖలు చేసిన అప్పీల్పై రిజిస్ట్రీ అభ్యంతరాలపై జస్టిస్ మౌసమీ భట్టాచార్య, జస్టిస్ గాడి ప్రవీణ్ కుమార్ల బెంచ్ సోమవారం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. భూదాన్ భూములపై రాష్ట్ర ప్రబుత్వానికి అధికారం లేదన్న అంశాన్ని సింగిల్ జడ్జి పట్టించుకోలేదన్నారు. దాదాపు 1,000 మంది ఇండ్లను కూల్చివేసినప్పటికీ కేవలం 311 మందికి మాత్రమే పట్టాలు మంజూరు చేశారని చెప్పారు.
రాతపూర్వక వివరణ ఆధారంగా సింగిల్ జడ్జి ఉత్తర్వులు జారీ చేశారని తెలిపారు. ప్రభుత్వ న్యాయవాది కట్రం మురళీధర్రెడ్డి వాదనలు వినిపిస్తూ.. అర్హులైన వారికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తున్నామని తెలిపారు. వాదనలను విన్న బెంచ్.. కూల్చివేత వ్యవహారానికి సంబంధించిన పిటిషన్ ఇంకా సింగిల్ జడ్జి వద్ద పెండింగ్లో ఉందని, అందువల్ల మధ్యంతర ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోవడానికి కారణాలు లేవని తెలిపింది. అందువల్ల అప్పీల్ విచారణార్హత దశలోనే కొట్టివేస్తున్నట్లు పేర్కొంది.

