- లెక్చరర్లకు ఇంటర్ విద్యాశాఖ డైరెక్టర్ అభిలాష అభినవ్ సూచన
హైదరాబాద్, వెలుగు: గవర్నమెంట్ జూనియర్ కాలేజీల్లో చదివే విద్యార్థుల సక్సెస్లో జూనియర్ లెక్చరర్లదే కీలక పాత్ర అని, విద్యా ప్రమాణాల పెంపునకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఇంటర్ విద్యాశాఖ డైరెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. బుధవారం హైదరాబాద్లో జరిగిన రాష్ట్రస్థాయి మాస్టర్ ట్రైనర్ల రెండో విడత శిక్షణా ముగింపు కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా మాట్లాడారు. 2026–27 విద్యా సంవత్సరం నుంచి అమలు చేయనున్న సవరించిన పాఠ్యాంశాలు, కొత్తగా ప్రవేశపెట్టిన 80:20 పరీక్షా విధానంపై లెక్చరర్లకు పూర్తి అవగాహన ఉండాలని సూచించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా డిజిటల్ క్లాస్రూమ్ సాధనాలైన ఐఈపీలు, ఐడీపీలను వాడుతూ బోధనా పద్ధతుల్లో మార్పులు తీసుకురావాలన్నారు.
ప్రాక్టికల్స్లో ఎస్ఓపీలు పాటిస్తూ ఇండస్ట్రీ లింకేజీలపై ఫోకస్ పెట్టాలని స్పష్టం చేశారు. ఐదు రోజుల వర్క్షాప్లో భాగంగా ఇప్పటి వరకు రెండు విడతల్లో 400 మంది డీఆర్పీలకు ట్రైనింగ్ ఇచ్చినట్లు ఆమె వెల్లడించారు.ఈ స్పెల్లో మ్యాథ్స్, జూలజీ, హిందీ, హిస్టరీ, సివిక్స్ సబ్జెక్టులపై కసరత్తు పూర్తి చేశామని.. ఆగస్టు 17న జరిగే చివరి విడతలో సంస్కృతం, ఉర్దూ, అరబిక్, ఫ్రెంచ్ వంటి ద్వితీయ భాషలకు శిక్షణ ఉంటుందని వివరించారు. కార్యక్రమంలో జేడీ వెంక్యా నాయక్, కోఆర్డినేటర్లు జ్యోత్స్న రాణి, జయమణి, డీఐఈఓ ఒడ్డెన్న పాల్గొన్నారు.
