
హైదరాబాద్, వెలుగు : ఇల్లు కూల్చివేతకు మున్సిపల్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అర్వింద్ కుమార్ ఆదేశాలు ఎలా ఇస్తారని రాష్ట్ర హైకోర్టు ప్రశ్నించింది. తన ఇంటిని కూల్చివేయాలని ప్రభుత్వం ఇటీవల ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ నాగార్జున కాంతామణి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జస్టిస్ కె. లలిత బుధవారం విచారించారు. పిటిషనర్ తరఫు లాయర్ ఆర్. పవన్రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ప్రతివాది ఆస్తికి, పిటిషనర్ ఆస్తికి సంబంధమే లేదని, సర్వే నంబర్లు కూడా వేరని కోర్టుకు చెప్పారు. కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా ఏ ప్రాతిపదికన కూల్చివేత ఉత్తర్వులిచ్చారో చెప్పాలని కోరారు. దాంతో విచారణకు హాజరైన మున్సిపల్ శాఖ స్పెషల్ సీఎస్ అర్వింద్ కుమార్పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఓ ఇంటి కూల్చివేత వ్యవహారంలో సీఎస్కు సంబంధం ఏమిటి..మీరు ఎలా ఆదేశాలు ఇస్తారని నిలదీసింది. కింది స్థాయిలో అధికారులు ఉండగా సీఎస్ ఎందుకు జోక్యం చేసుకోవాల్సి వచ్చిందని ప్రశ్నించింది. జీహెచ్ఎంసీ చట్టంలో అనేక లోపాలున్నాయని, వాటిని సరిదిద్దేందుకు తీసుకున్న చర్యలేమిటో చెప్పాలని ఆదేశించింది. ఇందు కోసం10 రోజులు గడువు ఇచ్చింది. ఇంటి కూల్చివేతకు సంబంధించి దాఖలైన కేసు తదుపరి విచారణను ఈ నెల12కు వాయిదా వేసింది.