అసైనీల వాదనలు వినకుండా భూమి ఎవరిదో చెప్పలేం
హైదరాబాద్ : బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కుటుంబానికి చెందిన జమునా హెచరీస్ ప్రైవేట్ లిమిటెడ్కు చెందిన భూ వివాదంలో జోక్యం చేసుకోరాదన్న గత ఉత్తర్వులను హైకోర్టు ఇంకో రెండు వారాలు పొడిగించింది. అసైనీల వాదనలు వినకుండా భూమి ఎవరిదో తేల్చలేమని పేర్కొంది. వాళ్లను కూడా ప్రతివాదులుగా చేర్చాలని ఆదేశించింది. ఆగస్టు16న తదుపరి విచారణ జరుపుతామని, అప్పటిదాకా వివాదస్పద మూడెకరాల భూమిలో ప్రభుత్వం జోక్యం చేసుకోవద్దంటూ జస్టిస్ ఎం సుధీర్ కుమార్ మంగళవారం ఉత్తర్వులిచ్చారు.
మెదక్ జిల్లా మాసాయిపేట మండలం అచ్చంపేట్లోని సర్వే నంబర్ 130లో 3 ఎకరాల ప్రభుత్వ భూములను ఆక్రమించారని, దీనిపై సంజాయిషీ కోరుతూ జూన్ 25న మాసాయిపేట తహసీల్దార్ నోటీసులు జారీ చేశారు. నోటీసులు అందుకున్న జమునా హెచరీస్, ఆ సంస్థ డైరెక్టర్లు ఈటల నితిన్ రెడ్డి, ఈటల జమున అదే నెల 30న ఆ నోటీసులను హైకోర్టులో సవాల్ చేశారు. ఆ భూముల్లో ప్రభుత్వం జోక్యం వద్దంటూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. ఆ ఉత్తర్వులను రద్దు చేయాలంటూ ప్రభుత్వం తాజాగా వెకేట్ స్టే పిటిషన్ వేసింది. ప్రభుత్వం మూడెకరాలు పేదలకు అసైన్ చేసిందని వాదనలు వినిపించింది.