
హైదరాబాద్, వెలుగు: మెట్రో రైలులో బెట్టింగ్ లకు సంబంధించిన ప్రకటనలపై వివరణ ఇవ్వాలంటూ మెట్రో రైలు ఎండీకి గురువారం హైకోర్టు నోటీసులు జారీ చేసింది. బెట్టింగ్ యాప్ల ప్రకటనలకు సంబంధించిన ఒప్పందాలపై విచారణ జరిపించాలని కోరుతూ న్యాయవాది ఎన్. నాగూర్ బాబు హైకోర్టులో పిల్ దాఖలు చేసిన విషయం విదితమే.
దీనిపై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజయ్ పాల్, జస్టిస్ యారా రేణుకలతో కూడిన బెంచ్ గురువారం విచారణ చేపట్టి ప్రతివాదులైన మెట్రోతోపాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, డీజీపీ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, జీహెచ్ఎంసీ కమిషనర్లకు నోటీసులు జారీచేసింది. తదుపరి విచారణను ఈ నెల 28కి వాయిదా వేసింది.