ఆర్ట్ టీచర్‌‌ పోస్టులకు తెలుగులోనూ పరీక్ష జరపాలి : హైకోర్టు

ఆర్ట్  టీచర్‌‌ పోస్టులకు తెలుగులోనూ పరీక్ష జరపాలి : హైకోర్టు

హైదరాబాద్‌‌, వెలుగు: నోటిఫికేషన్‌‌లో పేర్కొన్న విధంగా ఆర్ట్‌‌  టీచర్‌‌  పోస్టులకు తెలుగు భాషలో కూడా పరీక్షలు నిర్వహించాలని హైకోర్టు  ఉత్తర్వులు జారీ చేసింది. కేవలం ఇంగ్లిష్​  మీడియంలోనే పరీక్ష నిర్వహించడంతో అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. ఇంగ్లిష్​తో పాటు తెలుగులోనూ పేపర్‌‌  ఇవ్వాలని తెలంగాణ రెసిడెన్షియల్‌‌ ఎడ్యుకేషనల్‌‌  ఇన్‌‌స్టిట్యూషన్స్‌‌  రిక్రూట్‌‌మెంట్‌‌  బోర్డు (టీఆర్‌‌ఈఐఆర్‌‌బీ) ను హైకోర్టు ఆదేశించింది. 

2023 ఏప్రిల్‌‌ 5న నోటిఫికేషన్‌‌లో పేర్కొన్న అంశాలను పాటించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు దాఖలైన పలు పిటిషన్లను అనుమతించింది. ఆర్ట్‌‌  టీచర్‌‌  పోస్టుల భర్తీ కోసం గతంలో టీఆర్‌‌ఈఐఆర్‌‌బీ నోటిఫికేషన్‌‌  ఇచ్చింది. ఆగస్టు 1న పరీక్షలు నిర్వహించారు. నోటిఫికేషన్‌‌లో రెండు భాషల్లో(ఆంగ్లం, తెలుగు) లో పరీక్ష ఉంటుందని పేర్కొనగా, పరీక్ష మాత్రం ఇంగ్లిష్​ లోనే నిర్వహించారు. దీన్ని సవాల్‌‌  చేస్తూ జోగుళాంబ గద్వాల జిల్లా రాజోళి మండలం తాండ్రపాడుకు చెందిన జి.వినోద్‌‌తో పాటు మరికొందరు హైకోర్టులో పిటిషన్‌‌  దాఖలు చేశారు.

 ఆ పరీక్షను రద్దుచేసి తిరిగి రెండు భాషల్లో నిర్వహించేలా ఆదేశాలు ఇవ్వాలన్నారు. ఈ పిటిషన్‌‌పై న్యాయమూర్తి జస్టిస్‌‌  పుల్లా కార్తీక్‌‌  విచారణ చేపట్టారు. పిటిషనర్‌‌ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ‘‘నోటిఫికేషన్‌‌లో పేర్కొన్న విధంగా రెండు భాషల్లో పరీక్ష నిర్వహించడంలో టీఆర్‌‌ఈఐఆర్‌‌బీ విఫలం అయ్యింది. ఇంగ్లిష్​ భాషలోనే ఎగ్జామ్  నిర్వహించింది. ఇది రాజ్యాంగ నిబంధనల ఉల్లంఘనే అవుతుంది. తెలుగు మీడియం వారు వేలల్లో పరీక్షకు హాజరయ్యారు. 

పరీక్షను తెలుగులోనూ నిర్వహించేలా బోర్డుకు ఆదేశాలు ఇవ్వాలి” అని విజ్ఞప్తి చేశారు. రెసిడెన్షియల్‌‌  సొసైటీల పరిధిలోని ఇన్‌‌స్టిట్యూషన్‌‌లలో ఇంగ్లిష్​ మీడియంలో బోధిస్తున్న విషయాన్ని స్టాండింగ్‌‌  కౌన్సిల్‌‌  రమేశ్‌‌  ప్రస్తావించారు. పోటీతత్వ విద్యా వాతావరణాన్ని కొనసాగించాలనే సంస్థల లక్ష్యంతో ఇంగ్లిష్‌‌లో మాత్రమే పరీక్ష నిర్వహిస్తే సరిపోతుందని వాదించారు. వాదనలు విన్న జడ్జి.. మళ్లీ పరీక్ష నిర్వహించాలని టీఆర్‌‌ఈఐఆర్‌‌బీని ఆదేశించారు.