హైదరాబాద్, వెలుగు: నోటిఫికేషన్లో పేర్కొన్న విధంగా ఆర్ట్ టీచర్ పోస్టులకు తెలుగు భాషలో కూడా పరీక్షలు నిర్వహించాలని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. కేవలం ఇంగ్లిష్ మీడియంలోనే పరీక్ష నిర్వహించడంతో అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. ఇంగ్లిష్తో పాటు తెలుగులోనూ పేపర్ ఇవ్వాలని తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ రిక్రూట్మెంట్ బోర్డు (టీఆర్ఈఐఆర్బీ) ను హైకోర్టు ఆదేశించింది.
2023 ఏప్రిల్ 5న నోటిఫికేషన్లో పేర్కొన్న అంశాలను పాటించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు దాఖలైన పలు పిటిషన్లను అనుమతించింది. ఆర్ట్ టీచర్ పోస్టుల భర్తీ కోసం గతంలో టీఆర్ఈఐఆర్బీ నోటిఫికేషన్ ఇచ్చింది. ఆగస్టు 1న పరీక్షలు నిర్వహించారు. నోటిఫికేషన్లో రెండు భాషల్లో(ఆంగ్లం, తెలుగు) లో పరీక్ష ఉంటుందని పేర్కొనగా, పరీక్ష మాత్రం ఇంగ్లిష్ లోనే నిర్వహించారు. దీన్ని సవాల్ చేస్తూ జోగుళాంబ గద్వాల జిల్లా రాజోళి మండలం తాండ్రపాడుకు చెందిన జి.వినోద్తో పాటు మరికొందరు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఆ పరీక్షను రద్దుచేసి తిరిగి రెండు భాషల్లో నిర్వహించేలా ఆదేశాలు ఇవ్వాలన్నారు. ఈ పిటిషన్పై న్యాయమూర్తి జస్టిస్ పుల్లా కార్తీక్ విచారణ చేపట్టారు. పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ‘‘నోటిఫికేషన్లో పేర్కొన్న విధంగా రెండు భాషల్లో పరీక్ష నిర్వహించడంలో టీఆర్ఈఐఆర్బీ విఫలం అయ్యింది. ఇంగ్లిష్ భాషలోనే ఎగ్జామ్ నిర్వహించింది. ఇది రాజ్యాంగ నిబంధనల ఉల్లంఘనే అవుతుంది. తెలుగు మీడియం వారు వేలల్లో పరీక్షకు హాజరయ్యారు.
పరీక్షను తెలుగులోనూ నిర్వహించేలా బోర్డుకు ఆదేశాలు ఇవ్వాలి” అని విజ్ఞప్తి చేశారు. రెసిడెన్షియల్ సొసైటీల పరిధిలోని ఇన్స్టిట్యూషన్లలో ఇంగ్లిష్ మీడియంలో బోధిస్తున్న విషయాన్ని స్టాండింగ్ కౌన్సిల్ రమేశ్ ప్రస్తావించారు. పోటీతత్వ విద్యా వాతావరణాన్ని కొనసాగించాలనే సంస్థల లక్ష్యంతో ఇంగ్లిష్లో మాత్రమే పరీక్ష నిర్వహిస్తే సరిపోతుందని వాదించారు. వాదనలు విన్న జడ్జి.. మళ్లీ పరీక్ష నిర్వహించాలని టీఆర్ఈఐఆర్బీని ఆదేశించారు.