హైదరాబాద్, వెలుగు: రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం గుట్టల బేగంపేట సర్వే నెం.16లోని 10.20 ఎకరాల భూముల్లో జోక్యం చేసుకోవద్దని హైడ్రాను ఆదేశిస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. సున్నం చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో ఉందంటూ తమ పట్టా భూముల్లో హైడ్రా జోక్యం చేసుకోవడాన్ని సవాల్ చేస్తూ హైదరాబాద్ కు చెందిన వై. అంతిరెడ్డి మరో 8 మంది హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిని జస్టిస్ బి. విజయ్సేన్రెడ్డి విచారణ చేపట్టారు.
పిటిషనర్ తరఫు న్యాయవాది వాదిస్తూ..చాలా ఏండ్లుగా ఈ భూములకు పన్ను చెల్లిస్తున్నామని తెలిపారు. ఈ భూమిని 2002లోనే ప్రభుత్వం క్రమబద్ధీకరించిందని చెప్పారు. అయినా, ఇది ప్రభుత్వ భూమి అంటూ హైడ్రా ఫెన్సింగ్ వేయడానికి ప్రయత్నిస్తున్నదని పేర్కొన్నారు. దీనిపై పూర్తి వివరాలు చెప్పడానికి గడువు కావాలని అదనపు అడ్వకేట్ జనరల్ మహమ్మద్ ఇమ్రాన్ఖాన్ కోరడంతో న్యాయమూర్తి అనుమతిస్తూ విచారణను డిసెంబరు 23వ తేదీకి వాయిదా వేశారు.
