- వారి వినతి పత్రాలపై చట్టప్రకారం చర్యలు తీసుకోండి
- మియాపూర్ ఎస్హెచ్వోకు హైకోర్టు ఆదేశం
హైదరాబాద్, వెలుగు: తల్లిదండ్రులపై కుమార్తె ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి.. తల్లిదండ్రులు ఇచ్చిన కంప్లయింట్ను ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదని మియాపూర్ పోలీసులను హైకోర్టు ప్రశ్నించింది. మియాపూర్ ఎస్హెచ్వోను కోర్టుకు పిలిపించి వివరణ తీసుకున్నది. తల్లిదండ్రులు ఇచ్చిన వినతి పత్రం, ఫిర్యాదును స్వీకరించి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఈ విచారణను పర్యవేక్షించాలని కమిషనర్కు ఆదేశాలు జారీ చేసింది.
2024 డిసెంబరు నుంచి ఇచ్చిన వినతి పత్రాలు/ఫిర్యాదును మియాపూర్ పోలీసులు పట్టించుకోకపోవడాన్ని సవాల్ చేస్తూ మియాపూర్కు చెందిన డాక్టర్ దంపతులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ ఎన్.వి. శ్రవణ్కుమార్ సోమవారం విచారణ చేపట్టారు.
వాదనలను విన్న న్యాయమూర్తి డాక్టర్ దంపతుల కుమార్తె ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు దర్యాప్తు చేసి చార్జిషీటు దాఖలు చేసిన పోలీసులు.. తల్లిదండ్రుల కంప్లయింట్ను కూడా తీసుకొని ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. ఏడాది కాలంగా వారు వినతి పత్రాలు ఇచ్చినా..చర్య తీసుకోకపోవడాన్ని తప్పుబట్టారు. తల్లిదండ్రుల వినతి పత్రంపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు.
