పాత రోజులు గుర్తు చేశారు : పెండ్లి ఊరేగింపు .. కారెందుకు దండగ.. ఎడ్లబండి ఉండగా..

పాత రోజులు గుర్తు చేశారు : పెండ్లి ఊరేగింపు .. కారెందుకు దండగ.. ఎడ్లబండి ఉండగా..

 పెండ్లి ఊరేగింపు అనగానే లగ్జరీ కార్లు, చెవులకు చిల్లులు పడే డీజే చప్పుళ్లు, కండ్లు జిగేల్‌‌‌‌మనే లేజర్‌‌‌‌ లైట్ల వాడకమే ప్రస్తుత ట్రెండ్‌‌‌‌. కానీ ఆధునిక హంగుల మోజులో పడి మూలాలను మరువొద్దు అనుకున్నారు ఓ నవజంట. దీంతో తమ రిసెప్షన్‌‌‌‌ బరాత్‌‌‌‌ను ఎడ్లబండి, సాధారణ  డప్పుచప్పుళ్లతోనే జరుపుకొని అందరి దృష్టిని ఆకర్షించారు. 

ఆదిలాబాద్‌‌‌‌ జిల్లా గుడిహత్నూర్‌‌‌‌ మండలం సీతాగొంది గ్రామంలో ఆదివారం సంజన, సాయిప్రసాద్‌‌‌‌ వివాహం జరిగింది. బుధవారం ఆదిలాబాద్‌‌‌‌లోని ఓ బాంకెట్‌‌‌‌హాల్‌‌‌‌లో రిసెప్షన్‌‌‌‌ ఏర్పాటు చేశారు. పల్లె వాతావరణం ఉట్టిపడేలా వేడుక జరుపుకోవాలని భావించిన ఆ జంట ఎడ్లబండిపై, సాధారణ డప్పు చప్పుళ్ల మధ్య బరాత్‌‌‌‌ నిర్వహించాలని నిర్ణయించుకున్నారు.

 ఆ బండిపైనే గ్రామం నుంచి సుమారు ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న బాంకెట్‌‌‌‌హాల్‌‌‌‌కు చేరుకున్నారు. పాత తరం పద్ధతిలో ఎడ్లబండిపై రిసెప్షన్‌‌‌‌ ఊరేగింపును నిర్వహించుకున్న దంపతులను పలువురు అభినందించారు. ‌‌‌‌‌‌‌‌