- అరెస్ట్ చేసి తమ ముందు ప్రవేశపెట్టాలని ఆదేశాలు
హాలియా, వెలుగు : భూ వివాదంలో పక్షపాతంగా వ్యవహరించడమే కాకుండా, రిపోర్ట్ ఇవ్వడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఓ తహసీల్దార్ను అరెస్ట్ చేయాలని రాష్ట్ర మానవ హక్కుల సంఘం వారెంట్ జారీ చేసింది. వివరాల్లోకి వెళ్తే.. నల్గొండ జిల్లా తిరుమలగిరి (సాగర్) మండల పరిధిలోని ఓ భూ వివాదంలో తహసీల్దార్ అనిల్ ఏకపక్షంగా వ్యవహరించడంతో బాధితుడు ఇటీవల హెచ్ఆర్సీని ఆశ్రయించాడు. దీంతో ఈ వివాదంపై పూర్తిస్థాయి విచారణ జరిపి రిపోర్ట్ ఇవ్వాలని తహసీల్దార్ అనిల్ను హెచ్ఆర్సీ ఆదేశించింది. కానీ కమిషన్ ఇచ్చిన గడువు ముగిసినా రిపోర్ట్ ఇవ్వకుండా సదరు తహసీల్దార్ కాలయాపన చేశారు. దీంతో ఆగ్రహానికి గురైన హెచ్ఆర్సీ తహసీల్దార్ను అరెస్ట్ చేసేందుకు వారెంట్ జారీ చేసింది. ఏప్రిల్ 13వ తేదీ ఉదయం 11 గంటల వరకు తహసీల్దార్ను అనిల్ను అరెస్ట్ చేసి తమ ముందు హాజరుపరచాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. మండల మెజిస్ట్రేట్పై అరెస్ట్ వారెంట్ జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది.
