
- నాగారం భూములపై తహసీల్దార్కు హైకోర్టు ఆదేశం
హైదరాబాద్, వెలుగు: రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారంలోని సర్వే నంబర్ 181/1, 181/2, 181/3కు సంబంధించిన డీనోటిఫైడ్ వివరాలను పిటిషనర్కు ఇవ్వాలని తహసీల్దార్ను హైకోర్టు ఆదేశించింది. ఈ ఆదేశాలను అందుకున్న 30 రోజుల్లో డీనోటిఫైడ్ భూముల సర్టిఫైడ్ కాపీలను ఇవ్వాలని, లేకపోతే ఎందుకు ఇవ్వడం లేదో కారణాలను పిటిషనర్కు తెలియజేయాలని చెప్పింది.
ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 1872 (ప్రస్తుతం భారతీయ సాక్ష్య అధినియం–2023) ప్రకారం డీనోటిఫైడ్ చేసిన భూముల వివరాల సర్టిఫికెట్ కోసం గత ఆగస్టు 11న దరఖాస్తు చేసుకుంటే అధికారులు ఇవ్వలేదంటూ అమీర్పేట్కు చెందిన బీర్ల మహేశ్ పిటిషన్ దాఖలు చేశారు. సర్వే నంబర్ 181 భూదాన్ భూమి అని, అందుకే సర్టిఫికెట్ కోరుతున్నట్లు చెప్పారు. దీనిపై శుక్రవారం విచారించిన జస్టిస్ కె.లక్ష్మణ్ తహసీల్దార్కు ఆదేశాలిస్తూ.. పిటిషన్పై విచారణ క్లోజ్ చేశారు.