- విచారణ జులై 15కి వాయిదా
హైదరాబాద్, వెలుగు : ఉద్యోగుల పీఎఫ్ మొత్తాలను జమ చేయకపోవడంపై టీజీఎస్ ఆర్టీసీ బ్యాంక్ అకౌంట్లను ఫ్రీజ్ చేస్తూ రీజినల్ పీఎఫ్ కమిషనర్ ఇచ్చిన ఉత్తర్వుల అమలును హైకోర్టు నిలిపివేసింది. శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్టీసీ బ్యాంకు ఖాతాలను పీఎఫ్ కమిషనర్ ఫ్రీజ్ చేయడాన్ని సవాల్ చేస్తూ సంస్థ దాఖలు చేసిన పిటిషన్ను జస్టిస్ సీవీ భాస్కర్ రెడ్డి విచారించారు. ఆర్టీసీ తరఫున అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపించారు.
2014, మార్చి నుంచి 2019, సెప్టెంబర్ వరకు ఉన్న బకాయిలను ఏపీ, తెలంగాణ ఆర్టీసీ కార్పొరేషన్లు భరించాలని తెలిపారు. నేటికీ ఖాతా ఏపీఎస్ ఆర్టీసీ పేరుమీదనే ఉందన్నారు. రెండు రాష్ట్రాల విభజన తేల్చకుండానే అకౌంట్లను ఫ్రీజ్ చేయడంపై పీఎఫ్ కమిషనర్ మార్చి 21న ఇచ్చిన ఆదేశాల అమలును నిలిపివేయాలని కోరారు. వాదనల తర్వాత కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా రీజినల్ పీఎఫ్ కమిషనర్, రికవరీ ఆఫీసర్, విద్యానగర్ యూనియన్ బ్యాంక్ లకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఉత్తర్వుల అమలును నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. విచారణను జులై 15కు వాయిదా వేసింది.