సివిల్ కోర్టు ఉత్తర్వుల అమలుపై హైకోర్టు స్టే
హైదరాబాద్, వెలుగు: యజమాని, అద్దెదారు వివాదం నేపథ్యంలో 750 మంది విద్యార్థుల భవిష్యత్పై ప్రభావం పడుతున్నందున రేడియంట్ స్కూల్ను ఖాళీ చేయించాలన్న సివిల్ కోర్టు ఉత్తర్వుల అమలుపై హైకోర్టు స్టే ఇచ్చింది. ముషీరాబాద్లోని ఇమాన్ ఎ జమానా మిషన్కు చెందిన స్థలంలో నడుస్తున్న రేడియంట్ స్కూల్ను వెంటనే ఖాళీ చేయాలంటూ సివిల్ కోర్టు ఈ నెల 7న ఉత్తర్వులు జారీ చేసింది. దీనిని సవాల్ చేస్తూ ఆ స్కూల్ విద్యార్థుల తల్లిదండ్రులు హైకోర్టులో సుమారు 33 పిటిషన్లు దాఖలు చేశారు.
వీటిపై జస్టిస్ సూరేపల్లి నంద విచారణ చేపట్టి, మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. సివిల్ వివాదంలో అమాయకులైన 750 మంది విద్యార్థులకు సంబంధించి విద్యా హక్కు పరిరక్షణలో విద్యా శాఖ కమిషనర్ చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారని చెప్పారు. స్కూల్ను వెంటనే ఖాళీ చేయాలంటూ సివిల్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల అమలును నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. దీనిపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి, ఇమాన్ ఎ జమానా మిషన్కు నోటీసులు జారీ చేశారు.
