హైదరాబాద్, వెలుగు: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీకి మంగళవారం జరగాల్సిన చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికపై హైకోర్టు స్టే ఇచ్చింది. ఆచూకీ తెలియని 19 వార్డు కౌన్సిలర్గా గెలుపొందిన ఆకుల యాదగిరిని బుధవారం ఉదయం భార్యతో సహా హాజరుపరచాలంటూ ఆదేశాలు జారీ చేసింది. రెండు వర్గాల వారు భిన్న వాదనలను వినిపిస్తుండటంతో వాస్తవ నిర్ధారణ కోసం అమికస్ క్యూరీగా న్యాయవాది ఎ. రామకృష్ణారెడ్డిని నియమించింది.
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో 19వ వార్డు కౌన్సిలర్గా ఎన్నికైన యాదగిరి కనిపించకపోవడంతో ఆయన కుమారుడు ఆకుల హరికాంత్ హైకోర్టులో మంగళవారం ఉదయం లంచ్ మోషన్ పిటిషన్ వేశారు. ఎన్నిక కొనసాగుతున్న నేపథ్యంలో ఉదయం 11 గంటలకు జస్టిస్ మౌసమీ భట్టాచార్య, జస్టిస్ గాడి ప్రవీణ్కుమార్తో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది.
