రేపు హైకోర్టులో సైరా సినిమా వివాదంపై విచారణ
చిరంజీవి, రామ్ చరణ్ పై ఉయ్యాలవాడ వంశస్తుల ఆరోపణలు
రూ.50కోట్లకు తమను మోసం చేశారంటూ ఫైర్
సెన్సార్ బోర్డును ఆశ్రయించిన ఉయ్యాలవాడ వారసులు
సినిమాను తమకు చూపించే విడుదల చేయాలని డిమాండ్
ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన భారీ బడ్జెట్ సినిమా సైరా మూవీ వివాదం హైకోర్టుకు చేరింది. సైరా సినిమా విడుదల కాకుండా ఆపాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఉయ్యాలవాడ వారసులు. ఈ పిటిషన్ రేపు మంగళవారం విచారణకు రానుంది.
చిరంజీవి, రామ్ చరణ్ ఉయ్యాలవాడ వారసులను ఇబ్బంది పెడుతున్నారని అన్నారు ఉయ్యాలవాడ వంశస్తులు. ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి కథ తీసుకొని తమను మోసం చేశారని ఆరోపిస్తున్నారు. చిరంజీవి, రామ్ చరణ్ లు తమకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చి.. ఇపుడు మాట తప్పారని అన్నారు. సినిమాకు అయ్యే మార్కెట్ లో 10 శాతం అంటే.. రూ.50కోట్లు తమకు రావాల్సి ఉందన్నారు. న్యాయం కోసం పోరాటం చేస్తే తమపైనే అక్రమ కేసులు పెట్టారని ఆరోపించారు. తమకు న్యాయం చేసే వరకు సైరా నర్సింహారెడ్డి సినిమాను విడుదల చేయొదంటూ పిటిషన్ లో కోరారు ఉయ్యాలవాడ వారసులు.
సెన్సార్ బోర్డుకు ఫిర్యాదు
కథ విషయంలో తమను మోసం చేశారంటూ సెన్సార్ బోర్డుకు ఫిర్యాదు చేశారు ఉయ్యాలవాడ వంశీయులు. ఇప్పటికే జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో సైరా నిర్మాత రామ్ చరణ్, హీరో చిరంజీవీపై ఉయ్యాలవాడ వంశం ఐదో తరానికి చెందిన 23 మంది కేసు పెట్టారు.
సైరా స్టోరీ కలెక్షన్ సమయంలో తమతో రామ్ చరణ్ స్వయంగా మాట్లాడాడని, సినిమాకు కావాల్సిన కథను సేకరించారని ఉయ్యాలవాడ వంశీయులు చెబుతున్నారు. తమ కుటుంబాలకి ఆర్థిక సాయం చెయ్యడమే కాకుండా వారిని వారసులుగా ప్రపంచానికి పరిచయం చేస్తానని మాట ఇచ్చారంటున్నారు. నోటరీపై 23 మందితో సంతకాలు కూడా చేయించారని చెబుతున్నారు. సైరా మార్కెట్ విలువలో 10 శాతం ఇస్తామని మాటిచ్చారంటున్నారు. ఆ లెక్క ప్రకారం తమకు 50 కోట్లు రావాల్సి ఉందంటున్నారు… ఉయ్యాలవాడ వంశీయులు.
సినిమా షూటింగ్ సమయంలో తమతో మంచిగా మాట్లాడిన రామ్ చరమ్.. సినిమా నిర్మాణం పూర్తికాగానే మాట మార్చారని ఉయ్యాలవాడ వంశీయులు ఆరోపిస్తున్నారు. డబ్బులు అడిగేందుకు ఇంటికి వెళ్తే తమపై తప్పుడు కేసులు పెట్టారని మండిపడుతున్నారు. తమకు న్యాయం జరిగే వరకు ఆందోళన విరమించేంది లేదంటున్నారు ఉయ్యాలవాడ వారసులు. అక్టోబర్ 2న సైరా సినిమా రిలీజ్ అవుతుండగా.. ఉయ్యాలవాడ వంశస్థులు హైకోర్టుకు వెళ్లడం ఆసక్తి రేపుతోంది.