వానాకాలంలో మండుతున్న ఎండలు.. ఉక్కపోతతో ఉక్కిరి బిక్కిరవుతున్న జనాలు

వానాకాలంలో మండుతున్న ఎండలు.. ఉక్కపోతతో ఉక్కిరి బిక్కిరవుతున్న జనాలు

వానలు కురువాల్సిన సమయంలో ఎండలు మండి పోతున్నాయి. వర్ష కాలం ప్రవేశించినా నగరంలో ఎండల తీవ్రత అంతకు అంతా పెరిగింది. దీంతో ఉదయం వేళా ఎండ వేడిమి, రాత్రిళ్లు ఉక్కపోతతో ప్రజలు  తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రతి ఏటా జూన్ మొదటి వారంలో ఎండల తీవ్రత తగ్గుముఖం పడుతుంది. ఆ తర్వాత రెండవ వారం ప్రవేశం నుంచి చివర లోపు వర్షాలు కురుస్తాయి. దీంతో ఎండలు పోయి వర్షాలు మొదలు కావడంతో వాతావరణ చల్లబడుతుంది.అయితే ఈ ఏడాది నగరవాసులు భిన్నవాతావరణాన్ని చవి చూడాల్సివస్తోంది.మంచి ఎండాకాలంలో భారీగా అకాలవర్షాలు కురువగా, వాన కాలంలో ఎండలు దంచికొడుతున్నాయి.

దీంతో జూన్ 3వ వారం ప్రవేశించినా నగరంలో ఎండలు మండి పోతున్నాయి. దీనికి ఈ ఏడాది రుతుపవనాలు రావడం ఆలస్యమే ఇందుకు కారణమని వాతావరణం శాఖ అధికారులు వెల్లడిస్తున్నారు. ఏకంగా పగటి ఉష్ణోగ్రత 44.9 డిగ్రీలు, రాత్రి ఉష్ణోగ్రత 40.1 డిగ్రీలు నమోదవుతుంది. వీటితో పాటు నగరంలో పలు ప్రాంతాల్లో 40 నుంచి 45 డిగ్రీలకు వరకు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదైయ్యాయి. ఈ సమయంలో సాధారణ ఉష్ణోగ్రత 34 నుంచి35 డిగ్రీల నమోదు కావాల్సి ఉండగా ఏకంగా 5 నుంచి 10  డిగ్రీల వరకు అధికంగా నమోదు అవుతుండడంతో ఎండల తీవ్రతతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు,

మరో వైపు  ఈనెల 12 నుంచి అన్ని విద్యా సంస్థలు పునర్ ప్రారంభం కావడంతో ఎండ వేడిమితో ముఖ్యంగా విద్యార్థులు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. మరోవైపు పగలు నమోదు కావాల్సిన ఉష్ణోగ్రతలు రాత్రివేళా నమోదు అవుతుండడంతో ఉక్కపోతతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమయంలో అధిక డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అవుతుండడతో పగలు ఎండ వేడిమి, రాత్రి ఉక్కపోతతో నగరవాసులు అష్టకష్టాలు పడుతున్నారు. వరుణ దేవుడు ఎప్పుడు కణికరిస్తారని అని ఎదురు చూస్తున్నారు.