
హైదరాబాద్, వెలుగు : పొగాకు ఉత్పత్తులైన పాన్ మసాలా, గుట్కా, ఖైనీలను పోలీసులు అకారణంగా సీజ్ చేస్తున్నారని నల్గొండ, హైదరాబాద్, సూర్యాపేట, నాగర్కర్నూల్, ఖమ్మం జిల్లాలకు చెందిన వ్యాపారులు హైకోర్టులో రిట్లు దాఖలు చేశారు. వాటిపై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ లలిత విచారణ జరిపారు. బిల్లులు చెల్లించి కొనుగోలు చేసిన వాటిని పోలీసులు స్వాధీనం చేసుకుంటున్నారని, సుప్రీం కోర్టు ఉత్తర్వులను ఖాతరు చేయడం లేదని పిటిషనర్ అడ్వొకేట్ వాదించారు.
దీనిపై పోలీసులకు అవగాహన కల్పిస్తామని గవర్నమెంట్ ప్లీడర్ కోర్టుకు తెలిపారు. ప్లీడర్ వాదనపై హైకోర్టు మండిపడింది. ఎప్పుడూ అదే మాట చెప్పడం ఏమిటని ప్రశ్నించింది. కోర్టు ఉత్తర్వులపై సర్క్యులర్ జారీ చేయాలని, లేకపోతే విచారణకు డీజీపీ రావాలని ఆదేశించింది. సర్క్యులర్ను అమలు చేసి తీరాలని, లేకపోతే సుప్రీంకోర్టు, హైకోర్టుల ఆర్డర్ను అమలు చేయనట్లు అవుతుందని కోర్టు తేల్చి చెప్పింది.