వాహనదారులకు అలర్ట్.. హైదరాబాద్లో పెట్రోల్ బంకులు ఫుల్ రష్

వాహనదారులకు అలర్ట్.. హైదరాబాద్లో పెట్రోల్ బంకులు  ఫుల్ రష్

రేపటి(జనవరి 03) నుంచి పెట్రోల్, డీజిల్ ట్యాంకర్ల యజమానుల సమ్మె కారణంగా.. హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల దగ్గర వాహనదారులు బారులు తీరారు. బహీర్ బాగ్, హైదర్ గూడ, లక్డీకపూల్ సహా చాలా ప్రాంతాల్లో పెట్రోల్ బంకుల ముందు రద్దీ కనిపిస్తోంది. దీంతో ఆయా ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జాం అయ్యింది. అలాగే, వందలాదిగా వాహనదారులు వస్తుండటంతో పెట్రోల్ బంకు యాజమాన్యాలు వారిని కంట్రోల్ చేయలేక నో స్టాక్ బోర్డులు పెడుతున్నారు.

హిట్ అండ్ రన్ కేసుల్లో కొత్త చట్టం తీసుకొచ్చిన మార్పులతో.. మహారాష్ట్ర వ్యాప్తంగా ట్రక్ డ్రైవర్లు ధర్నాకు దిగారు. ఎక్కడికక్కడ వాహనాలను నిలిపివేశారు. ఇందులో పెట్రోల్, డీజిల్ ట్యాంకర్లు సైతం ఉండటంతో.. ఇప్పుడు మహారాష్ట్ర, హైదరాబాద్ వ్యాప్తంగా పెట్రోల్ కొరత ఏర్పడింది.  విషయం తెలుసుకున్న వాహనదారులు పెట్రోల్ బంకులకు క్యూ కట్టారు.

హిట్ అండ్ రన్ కేసు విషయానికి వస్తే.. చట్టంలో మార్పుల తర్వాత.. ఎవరినైనా వ్యక్తిని ఢీకొట్టి వెళ్లిపోతే.. ఆ కేసులో 10 లక్షల జరిమానా, గరిష్ఠంగా పదేళ్ల జైలు శిక్ష విధించే విధంగా.. ఇటీవల కేంద్ర ప్రభుత్వం చట్ట సవరణ చేసింది. దీన్ని ట్రక్, లారీ, క్యాబ్ డ్రైవర్లు వ్యతిరేకిస్తున్నారు. హిట్ అండ్ రన్ కేసులో కేవలం ట్రక్, లారీ డ్రైవర్లను మాత్రమే బాధ్యులను చేసే విధంగా చట్టం ఉందని.. ఇందులో బాధితుల తప్పు ఎందుకు ఉండదని ప్రశ్నిస్తున్నారు ట్రక్ యజమానులు. కేంద్రం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు నిరసన వ్యక్తం చేస్తామని.. దేశ వ్యాప్తంగా ట్రక్, లారీ ట్రైవర్ల సమ్మె చేస్తామని హెచ్చరిస్తున్నారు.