- 324 ప్లాట్ల వేలానికి ఏర్పాట్లు చేస్తున్న హెచ్ఎండీఏ
- ఇయ్యాల బహదూర్ పల్లి ప్రీ బిడ్ సమావేశం
హైదరాబాద్, వెలుగు: సర్కారు భూములు అర్రాస్ పెట్టేందుకు హెచ్ఎండీఏ మరోసారి రెడీ అవుతోంది. ఇప్పటికే కోకాపేట్, ఖానామెట్, ఉప్పల్ భగాయత్ భూముల వేలాన్ని విజయవంతంగా పూర్తి చేసిన అధికారులు.. బహదూర్పల్లి, తొర్రూరులోని భూముల విక్రయానికి ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని బహదూర్పల్లి, రంగారెడ్డి జిల్లా పరిధి తొర్రూరులోని ప్లాట్లు అమ్మాలని నిర్ణయించారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎంఎస్టీసీ ఆధ్వర్యంలో ఈ- వేలం ద్వారా విక్రయించేందుకు హెచ్ఎండీఏ ఏర్పాట్లు పూర్తి చేసింది. బహదూర్పల్లిలో 40 ఎకరాల విస్తీర్ణంలో అభివృద్ధి చేస్తున్న లే అవుట్లో 101 పాట్ల విక్రయాలకు సంబంధించి బుధవారం ప్రీ బిడ్ మీటింగ్ జరగనుంది. బహదూర్పల్లిలో మేకల వెంకటేశ్ ఫంక్షన్హాల్లో ఉదయం 11 గంటలకు మీటింగ్ నిర్వహించనున్నారు. రంగారెడ్డి జిల్లాలోని తొర్రూరులో117 ఎకరాల విస్తీర్ణంలో హెచ్ఎండీఏ లేఅవుట్ డెవలప్ చేస్తోంది. అందులోని 223 ప్లాట్లను ఈ వేలం ద్వారా విక్రయించనుంది. దీనికి సంబంధించి ప్రీ బిడ్ మీటింగ్ ఈనెల 25న తొర్రూర్ సైట్లోనే నిర్వహించనున్నట్లు హెచ్ఎండీఏ అధికారులు తెలిపారు.