హైదరాబాద్, వెలుగు: మొన్నటిదాకా రాజీవ్ స్వగృహ ఫ్లాట్లను అమ్మిన హెచ్ఎండీఏ.. ఇప్పుడు మొత్తం టవర్లనే అమ్మేందుకు నిర్ణయించింది. హైదరాబాద్లోని పోచారం, గాజులరామారంలో పూర్తికాని రాజీవ్ స్వగృహ టవర్లను లాటరీ ద్వారా కేటాయించేందుకు శనివారం నోటిఫికేషన్ విడుదల చేసింది. పోచారంలో నాలుగు టవర్లు ఉండగా ఒక్కో దాంట్లో 9 ఫ్లోర్లు ఉన్నాయి. టవర్ను బట్టి ఒక్కో దాంట్లో 72 నుంచి 198 ఫ్లాట్లు ఉన్నాయి. ఇక్కడ ఒక్క స్క్వేర్ ఫీట్ ధరను రూ.1,650గా హెచ్ఎండీఏ నిర్ణయించింది. గాజులరామారంలో 14 ఫ్లోర్లు ఉండే 5 టవర్లు ఉన్నాయి.
ఒక్కో టవర్లో 112 ఫ్లాట్లు ఉన్నాయి. ఇక్కడ స్క్వేర్ ఫీట్కు రూ.1,350 నుంచి రూ.1,650 వరకు నిర్ణయించింది. ఆసక్తి ఉన్న వ్యక్తులు, సొసైటీలు, అసోసియేషన్లు (పీఎస్యూ అసోసియేషన్లు సహా), బిల్డర్లు, డెవలపర్లు ఎవరైనా టవర్ మొత్తం ఖరీదులో 2 శాతం డిపాజిట్(ఈఎండీ- ఎర్నెస్ట్ మనీ డిపాజిట్)ను మెట్రోపాలిటన్ కమిషనర్, హెచ్ఎండీఏ పేరిట డీడీ చెల్లించాలని నోటిఫికేషన్లో పేర్కొంది. జనవరి 30వ తేదీ సాయంత్రం 5 గంటల్లోపు ఆ డీడీలను హైదరాబాద్ హిమాయత్ నగర్లోని రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ లిమిటెడ్ ఎండీకి సబ్మిట్ చేయాలని తెలిపింది. డిపాజిట్ చెల్లించిన వాళ్లకు లాటరీ పద్ధతిలో టవర్లను కేటాయిస్తామని చెప్పింది. టవర్లు, ఫ్లాట్లు, వాటి ల్యాండ్కు సంబంధించిన వివరాలకు www.hmda.gov.in, www.swagruha.telangana.gov.inను చూడాలని సూచించింది.