ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో పనిచేస్తున్న ప్రొఫెసర్లందరికీ ఇకపై తమ విభాగానికి నాయకత్వం వహించే అవకాశం దక్కనుంది. ప్రతి డిపార్ట్మెంట్లోనూ రెండేండ్లకోసారి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్(హెచ్వోడీ)ను మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సీనియర్ను హెచ్వోడీగా నియమించి.. రిటైర్ అయ్యే వరకూ అతడినే కొనసాగించే పద్ధతికి స్వస్తి పలికింది. ప్రస్తుత విధానంలో కొద్ది మందికే హెచ్వోడీ పదవి దక్కుతుండడం, అలా పాతుకుపోతున్న కొంతమంది ప్రొఫెసర్లు అవినీతికి పాల్పడటం, ఇతర సిబ్బందిని వేధించడం వంటి కారణాలతో డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్(డీఎంఈ) ఈ నిర్ణయం తీసుకుంది. దీనికి రెండ్రోజుల క్రితం రాష్ట్ర ప్రభుత్వం ఆమోద ముద్ర వేస్తూ జీవో జారీ చేసింది.
రొటేషన్ పద్ధతిలో చాన్స్…
కొత్త నిబంధనల ప్రకారం.. ప్రతి డిపార్ట్మెంట్కు సీనియర్ ప్రొఫెసర్ను హెచ్వోడీగా నియమిస్తారు. రెండేండ్ల తర్వాత ఆయన్ను తప్పించి, సీనియరిటీ జాబితాలోని రెండో వ్యక్తిని హెచ్వోడీగా నియమిస్తారు. సీనియారిటీ జాబితాలో ఉన్న ఇద్దరు అధికారుల పదవికాలం రెండేండ్లు, అంతకంటే తక్కువ ఉంటే.. వారిద్దరికీ మిగిలి ఉన్న కాలాన్ని విభజించి హెచ్వోడీగా అవకాశం కల్పిస్తారు. మూడేండ్ల అనుభవం ఉన్న ప్రొఫెసర్లను మాత్రమే హెచ్వోడీ పదవికి పరిగణనలోకి తీసుకుంటారు. ప్రభుత్వ నిర్ణయాన్ని కొంతమంది సీనియర్ ప్రొఫెసర్లు వ్యతిరేకిస్తున్నారు. జూనియర్లను హెచ్వోడీగా నియమిస్తే, వారి కింద తామెట్లా పనిచేస్తామని ప్రశ్నిస్తున్నారు. మెజారిటీ ప్రొఫెసర్లు, జూనియర్ డాక్టర్లు మాత్రం డీఎంఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు.
త్వరలోనే సీఏఎస్!..
ప్రొఫెసర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తున్న కెరీర్ అడ్వాన్స్మెంట్ స్కీమ్(సీఏఎస్)కు కూడా ప్రభుత్వం త్వరలోనే పచ్చజెండా ఊపుతుందని వైద్యా శాఖ వర్గాలు చెబుతున్నాయి. ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్తో ఇటీవల జరిగిన ప్రభుత్వ డాక్టర్ల సమావేశంలోనూ సీఏఎస్పై చర్చ జరిగింది. కొన్నేండ్లుగా తాము సీఏఎస్ అమలు చేయాలని కోరుతున్నా పట్టించుకోవడంలేదని డాక్టర్లు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. వీలైనంత త్వరగా సీఏఎస్ అమలు చేయించాలని ఆయనను కోరారు. ఇందుకు మంత్రి సుముఖత వ్యక్తం చేశారని డాక్టర్లు చెబుతున్నారు. ఇటీవల సీఏఎస్ ఫైల్ డీఎంఈ నుంచి ప్రభుత్వానికి చేరింది. సీఎం అనుమతి కోసం ఫైల్ను పంపించినట్టు సమాచారం. ప్రస్తుత పద్ధతి ప్రకారం.. పోస్టులు ఖాళీగా ఉన్నప్పుడే అసిస్టెంట్, అసోసియేట్లకు ప్రయోషన్ ఇస్తున్నారు. ఈ విధానంతో అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా, అసోసియేట్ ప్రొఫెసర్లుగా చాలా ఏండ్లు ఉండిపోవాల్సి వస్తోంది. సీఏఎస్ అమలైతే ఖాళీలతో సంబంధం లేకుండా అసిస్టెంట్గా నాలుగేండ్లు పూర్తి చేసుకుంటే, అసోసియేట్గా ప్రమోషన్ ఇస్తారు. అసోసియేట్గా ఆరేండ్లు పూర్తి చేసిన వారికి ప్రొఫెసర్ హోదా ఇస్తారు. ప్రస్తుతం ఈ విధానం నిమ్స్లో అమలవుతోంది. తాజాగా మంత్రి ఈటల హామీ ఇవ్వడం, ఫైల్ సీఎంవోకు చేరడంతో సీఏఎస్పై డాక్టర్లు ఆశలు పెట్టుకుంటున్నారు.