హోలీ సంబురం.. పల్లెల్లో ఎంతో ప్రత్యేకం

హోలీ సంబురం.. పల్లెల్లో ఎంతో ప్రత్యేకం

పండుగ ఏదైనా పల్లెల్లో ఎంతో ప్రత్యేకంగా జరుపుకొంటారు. పిల్లల నుంచి పెద్దల వరకు తమదైన సందడితో  హోలీ  పండుగకు మరింత వన్నె తెస్తారు. అసలే పల్లె పదాలతో సాహిత్య  పరిమళాలు  కొత్త గుబాళింపు వెదజల్లే పల్లెల్లో ఆ సందడి మరింత ఆసక్తికరంగా ఉంటుంది. కానీ, 'జాజిరి' ఆట మెల్లగా తగ్గిపోతోంది. ఆలస్యంగా వచ్చిన సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక మార్పుల కారణంగా పండుగను జరుపుకునే ఈ సంప్రదాయ పద్ధతి  క్రమక్రమంగా తగ్గిపోతోంది.

ఈ పండుగ సమయంలో చిన్నారుల జాజిరి పాటలు పల్లెల్లో  ఏరులై పారుతాయి. కాముని పున్నమిని పురస్కరించుకొని తొమ్మిది రోజుల పాటు గ్రామాల్లో జాజిరి ఆడటం తరతరాలుగా వస్తున్న సంప్రదాయం. చిన్నారులు, యువకులు చిన్నచిన్న కర్రలు పట్టుకొని కోలాటం ఆడుతూ, పాటలు పాడుతూ వీధుల్లో ఉత్సాహం నింపుతారు. ఇంటింటికీ తిరుగుతూ కాముని ఆటలు ఆడుతారు. నిండు చంద్రుడి వెన్నెల వెలుగుల్లో చిన్నారులు పాడే పాటలు పల్లెలకు కొత్త అందాన్ని తీసుకొస్తాయి. అవి అందర్నీ కవ్విస్తాయి. నవ్విస్తాయి. చిన్నారులు, యువకులను ఉర్రూతలూగిస్తాయి. అలాంటిది 'జాజిరి' ఆట క్రమక్రమంగా కనుమరుగవుతోంది. ఈ సంప్రదాయ పద్ధతి నెమ్మదిగా తగ్గిపోతోంది.   జాజిరి పాటల్లో కష్టాలు, కన్నీళ్లు ఉంటాయి. అంతులేని ఆనందం కూడా ఉంటుంది. అంతకుమించి లోతైన అర్థం ఆ జాజిరి పాటల్లో ఉంటుంది. తేలికైన పదాల్లో గొప్ప సందేశం ఇవ్వడం, ఆ అర్థాన్ని సున్నితమైన హాస్యంతో మిళితం చేసి చెప్పడం జాజిరి పాటలకే సొంతం. జాజిరి పాటలు పాడుతూ ఇండ్ల ముందుకు వచ్చే చిన్నారులకు అమ్మలక్కలు తమకు తోచిన కానుకలు ఇచ్చి పంపిస్తారు.

సాధారణంగా తమకు పండిన పంట ఉత్పత్తులతో పాటు డబ్బులు కానుకలుగా ఇస్తారు. ఇలా తొమ్మిది రాత్రులు ఆడుకొని చివరి రోజు కాముడి దహనం చేస్తారు. కోలాటానికి ఉపయోగించిన కర్రలను మంటల్లో కాల్చుతారు. మరుసటి రోజు రంగులు చల్లుకుంటూ హోలీ పండుగను సంబురంగా జరుపుకొంటారు. రంగుల్లో తడిసి ముద్దయ్యాక స్నేహితులంతా కలిసి ఊరి చివరన ఉన్న బావులు, కుంటల వద్దకు వెళ్లి ఈత కొడుతూ కేరింతలు పెడతారు. జాజిరి పాటల్లో పురాణ ఇతిహాసాలకు సంబంధించిన పాటలతో పాటు వ్యవసాయ, శృంగార సంబంధ అంశాలు ఎక్కువగా ఉంటాయి. కోలలు, డప్పులు, చప్పుళ్లకు అనుగుణంగా, లయబద్ధంగా పాటలు ఉంటాయి. టీవీలు, సెల్‌‌‌‌ఫోన్లు, కంప్యూటర్ల రాకతో పాత సంప్రదాయాలు కనుమరుగవుతున్న నేపథ్యంలో పుస్తకాలతో కుస్తీపడుతున్నారు. మార్కుల వేటలో జీవన యుద్ధం చేస్తున్న నేటితరం .. సామెతలు, పొడుపు కథలతో జానపద సాహిత్యం వెలకట్టలేని సంపదగా గుర్తించాలి.      

    

 బూరం ప్రశాంత్,
జర్నలిస్ట్