ఆసుపత్రి బిల్లులు లక్షల్లో.. సీఎం రిలీఫ్ మాత్రం వేలల్లో..

ఆసుపత్రి బిల్లులు లక్షల్లో.. సీఎం రిలీఫ్ మాత్రం వేలల్లో..

సీఎంఆర్​ఎఫ్​ కోసం ఏడాది ఎదురుచూడాల్సిందే!

ఆ తర్వాత కూడా రెండు నెలల పాటు బ్యాంకుల్లోనే  చెక్కులు

పైరవీలు.. ఖర్చు పెట్టుకుంటేనే ఫైల్ ముందుకు

తెచ్చిన అప్పుల వడ్డీలకూ సాల్తలెవ్వంటున్న బాధితులు

కరీంనగర్, వెలుగు: తగరాని రోగాలతో తప్పనిసరి పరిస్థితుల్లో అప్పుసప్పు చేసి ప్రైవేట్, కార్పొరేట్​ హాస్పిటళ్లలో ఎమర్జెన్సీ ట్రీట్​మెంట్ చేయికుంటున్న పేద, దిగువ మధ్యతరగతి కుటుంబాలను సీఎం రిలీఫ్​ఫండ్​పెద్దగా ఆదుకోవట్లేదు. ఎంతో కొంత ఆసరా అవుతుందని భావించి అప్లై చేసుకుంటే పైరవీలు.. పర్సెంటేజీలకు హామీ ఇస్తే తప్ప  ఫైల్ ముందుకు కదలట్లేదు. ఏడాది పాటు ఎదురుచూస్తే తప్ప ప్రభుత్వం నుంచి చెక్కులు వస్తలేవు. అయిన ఖర్చులో నాలుగోవంతూ అమౌంట్​ ఉంటలేదు. ఆ చెక్కులను బ్యాంకులో వేస్తే క్లియర్​కావడానికి మరో రెండు నెలలు పడుతాంది.

ట్రీట్​మెంట్​ కోసం అప్పులు..

పేద కుటుంబాల్లో ఎవరికైనా పెద్ద రోగమొస్తే అయితే చావడమా, లేదంటే అప్పులపాలు కావడమా అన్నట్లుగా ఉంది పరిస్థితి.  రాష్ట్రంలో పేరుకు ఆరోగ్యశ్రీ అమలవుతున్నప్పటికీ వివిధ వ్యాధులకు అందులో ట్రీట్​మెంట్​ఉండట్లేదు. ఒకవేళ ఉన్నా చాలా ప్రైవేట్​, కార్పొరేట్​ హాస్పిటల్స్ సవాలక్ష రిస్ట్రిక్షన్స్ తో మేజర్ సర్జరీలు చేయట్లేదు.  తమకు వర్క్​అవుట్​కాదని చెప్పి తప్పించుకుంటున్నాయి. తప్పనిసరి పరిస్థితుల్లో పేదలు అప్పుసప్పు చేసి ప్రాణాలు కాపాడుకుంటున్నా  తర్వాత వాటిని తీర్చేందుకు అష్టకష్టాలుపడుతున్నారు. కొందరైతే ఆస్తిపాస్తులను తెగనమ్ముకుంటున్నారు.

సీఎం రిలీఫ్​ ఫండ్ ఆశతో..

చాలా మంది పేదలు,  లోయర్​ మిడిల్​ క్లాస్​ ఫ్యామిలీలు సీఎం రిలీఫ్​ ఫండ్​ వస్తుందనే ఆశతోనే ప్రైవేట్, కార్పొరేట్​ హాస్పిటల్స్​లో ట్రీట్​మెంట్​చేయించుకుంటున్నారు. సీఎంఆర్​ఎఫ్​ వచ్చాక చేసిన అప్పులు తీరుద్దామని భావిస్తున్నారు. మొదట్లో హాస్పిటల్​ రిపోర్టులు, బిల్లులు చేతికి వచ్చేందుకే వారాలు పడుతోంది. ఆ బిల్లులు రాగానే వాటిని తీసుకొని బాధితులు గ్రామాల్లో రూలింగ్​పార్టీకి చెందిన సర్పంచులను, టౌన్లలో కార్పొరేటర్లను కలుస్తున్నారు. వాళ్లు మరికొన్ని రోజులు తిప్పుకుంటున్నారు. ఈ క్రమంలో కొందరు పర్సెంటేజీలు మాట్లాడుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. రూ. 2వేల  నుంచి 5వేలు చేతిలో పెడితే తప్ప ఫైల్​ మూవ్​ కావట్లేదు. అక్కడి నుంచి ఈ అప్లికేషన్లన్నీ నియోకవర్గ ఎమ్మెల్యే లకు అందిస్తున్నారు. 50, 100 ఫైళ్లు అయితే తప్ప వీళ్లు సీఎం ఆఫీస్ కు పంపడం లేదు. సీఎం ఆఫీసుకు వెళ్లాక ఫైళ్లన్నింటినీ అన్ని రకాలుగా వెరిఫై, క్రాస్​చెక్​ చేస్తున్నారు. స్టేట్​వైడ్​ రోజూ వేలకొద్దీ అప్లికేషన్లు రావడంతో సెక్రెటేరియెట్​లో స్క్రూటినీకే నెలలు గడుస్తున్నాయి. ఫైళ్లు కరెక్ట్​గా ఉన్నాయనుకున్నాక  సీఎంఆర్​ఎఫ్​​ చెక్కులు రెడీ చేసి తిరిగి ఎమ్మెల్యే క్యాపు ఆఫీసుకు పంపుతున్నారు. ఈక్రమంలో బాధితుల చేతికి చెక్కులు రావడానికి 6 నెలల నుంచి ఏడాది దాకా పడుతోంది. కొన్నిసార్లు  ఏవైనా రిపోర్టులు సరిగ్గా లేవనుకుంటే వెనక్కి పంపుతారు. ఇలాంటి ఫైళ్లను మళ్లీ పంపాలంటే మరో 2 నెలలు గడుస్తున్నాయి. ఎమ్మెల్యేకు తెలిసిన వారికి, టీఆర్​ఎస్​లీడర్లు, కార్యకర్తల విషయంలో ఫైళ్లు కొంచెం ఫాస్ట్ గా మూవ్ అవుతున్నా కామన్​ పీపుల్ మాత్రం​ సఫర్​ అవుతున్నారు.

వచ్చేది నాలుగోవంతే..

సీఎం రిలీఫ్ ఫండ్ కింద అప్లై చేసుకున్న వాళ్లకు హాస్పిటల్​ బిల్లులో 25  నుంచి 30శాతం వరకే క్లెయిమ్​ అవుతోంది. అంటే లక్ష ఖర్చు చేసుకున్నవాళ్ల చేతికి రూ.25 నుంచి 30వేల లోపే సీఎంఆర్​ఎఫ్​ చెక్కులు వస్తున్నాయి. అది కూడా ఒకట్రెండు నెలల్లో వస్తే బాధితులకు కొంత రిలీఫ్​గా ఉండేది. కానీ దవాఖాన్ల నుంచి డిశ్చార్జి అయి ఏడాదయినా చెక్కులు రావట్లేదు. ఆ వచ్చిన చెక్కులను బ్యాంకుల్లో వేస్తే క్లియర్​ కావడానికి మరో నెల నుంచి  మూన్నెళ్లదాకా పడుతోంది. ఇంతా చేస్తే వచ్చిన పైసలు మిత్తికి కూడా సరిపోతలేవని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హాస్పిటల్​ ఖర్చులో కనీసం 50 నుంచి 60 శాతం వరకు వచ్చేలా చూసి, ఆ మొత్తాన్ని నెల, 2 నెలల్లో అందిస్తే ఆపదలో ఉన్న పేదలకు మేలు జరిగే చాన్స్​ ఉంటుంది.

80 వేల బిల్లు పెడితే 17వేలు వచ్చినయ్​..

మా కొడుకుకు హెల్త్ బాగా లేకుంటే ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చేర్పించినం.  ట్రీట్మెంట్ కు లక్ష దాకా ఖర్చయినయ్. అప్పు తెచ్చి బిల్లు కట్టినం.  సీఎం ఆర్ ఎఫ్ ద్వారా తిరిగి ఇస్తారంటే  హాస్పిటల్​ నుంచి రూ.80వేల బిల్లు పెట్టి అప్లై చేసినం. అప్లై చేసిన 4 నెలల తర్వాత రూ.17వేల చెక్ వచ్చింది. వచ్చిన పైసలు వడ్డీకి కూడా చాలలే.  హాస్పిటల్ ఖర్చులో సగమన్నా వస్తే మా లాంటి పేద కుటుంబాలకు ఆసరా ఉంటది.
–పిట్టల తిరుపతి, చొప్పదండి, కరీంనగర్

ఫొటోలో కనిపిస్తున్న బాలుడి పేరు దూస రితీష్ (7). అతని తల్లిదండ్రులు కావ్య, వెంకటేశ్. వీళ్లది కరీంనగర్ జిల్లా గంగాధర మండలం గర్శకుర్తి. కావ్య బీడీలు చుడుతూ, వెంకటేశ్​ సాంచాలు నడుపుతూ కుటుంబాన్ని భారంగా వెళ్లదీస్తున్నరు. 2019 నవంబర్ లో  రితీష్​ ఉన్నట్టుండి ఊపిరి తీసుకోలేక పోయిండు. అప్పటికప్పుడు కరీంనగర్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చేర్పించిన్రు. లక్ష రూపాయలు ఖర్చు చేసినా తగ్గకపోవడంతో డాక్టర్లు హైదరాబాద్​లోని ఓ కార్పొరేట్ హాస్పిటల్ కు  రెఫర్ చేసిన్రు. లంగ్స్​కు ఆపరేషన్​ చేయడంతో రితీష్​కు గండం గట్టెక్కింది.  ఇందుకు రూ.7 లక్షల దాక ఖర్చయింది.  మొత్తంగా రితీష్​ ట్రీట్​మెంట్​ కోసం రూ.8లక్షలు అప్పు చేసిన ఆ నిరుపేద కుటుంబం నెలనెలా మిత్తిల భారం మోయలేకపోతున్నది. ఈ క్రమంలోనే 2019 డిసెంబర్​లో సీఎం రిలీఫ్​ఫండ్​కు  అప్లై చేసుకున్నారు. ఏడాది తర్వాత  ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా రూ.24వేల చెక్కు వచ్చింది.  ఈ మొత్తం తాము నెల నెలా కట్టే మిత్తిలకు కూడా సరిపోదని ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నరు.

For More News..

ప్లాట్ అమ్మాలన్నా.. కొనాలన్నా పిటిఐన్ ఉండాల్సిందే

సీక్రెట్​ ఆపరేషన్​తో చైనా సైన్యానికి షాక్

రెండేండ్ల దాకా 25 శాతం జనానికి వ్యాక్సిన్ డౌటే!