హైదరాబాద్, వెలుగు: అమెరికాలోని అయో వా,- తెలంగాణ మధ్య పరస్పర సహకారం ఉండాలని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. అమెరికా పర్యటనలో ఉన్న మంత్రి.. తొలి రోజు అయోవా స్టేట్ క్యాపిటల్ డెమోయిన్లో ఆ రాష్ట్ర లెఫ్టినెంట్ గవర్నర్ ఆడమ్ గ్రెగ్ను కలిశారు. అగ్రికల్చర్ స్టేట్గా పేరున్న అయోవాకి, తెలంగాణకి అనేక సారూప్యతలు ఉన్నాయని మంత్రి తెలిపారు. ఆహార ధాన్యాల ఉత్పత్తి, పౌల్ట్రీ, మాంసం ఉత్పత్తిలో నంబర్ వన్గా నిలిచాయని, భవిష్యత్తులో ఈ రెండు రాష్ట్రాల మధ్య అనేక అంశాల్లో పరస్పర సహకారానికి అవకాశాలు ఉన్నాయన్నారు.
అయోవా, తెలంగాణ వ్యవసాయ, అనుబంధ రంగాల్లో కలిసి పనిచేస్తే అద్భుతాలు సృష్టించవచ్చని ఆడమ్ గ్రెగ్ అభిప్రాయపడ్డారు. అయోవాకు చెందిన శాస్త్రవేత్త నార్మన్ బోర్లాగ్ చేసిన కృషి ఫలితంగా ఆహార ధాన్యాల ఉత్పత్తి పెరిగిందని తెలిపారు. తర్వాత అయోవా స్టేట్ వర్సిటీ క్యాంపస్ను నిరంజన్రెడ్డి సందర్శించారు. అయోవా స్టేట్ యూనివర్సిటీ, ప్రొఫెసర్ జయశంకర్ అగ్రి వర్సిటీ మధ్య స్టూడెంట్, ఫ్యాకల్టీ ఎక్స్చేంజ్ ప్రోగ్రాం ఉండాలని మంత్రి పేర్కొన్నారు.