- వ్యాపారి ఇంట్లో చోరీ
- రూ.5 లక్షలతో పరారైన పనిమనిషి అరెస్ట్
శంషాబాద్, వెలుగు: వ్యాపారి ఇంట్లో డబ్బులు కొట్టేసిన పనిమనిషిని రాజేంద్రనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. హైదర్ గూడలోని నలందనగర్ కాలనీ కర్ణి తామర అపార్ట్ మెంట్ ఫ్లాట్ నం.312లో ఉండే అర్జున్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. శుక్రవారం ఉదయం 11 గంటలకు అర్జున్ రూ.5 లక్షలతో ఉన్న బ్యాగ్ ను ఇంట్లో పెట్టి పనిమీద బయటికి వెళ్లాడు. మధ్యాహ్నం తిరిగి వచ్చి చూసేసరికి ఇంట్లో బ్యాగ్ కనిపించలేదు. భార్యను అడగగా..తనకు తెలియదని ఆమె సమాధానం చెప్పింది. దీంతో అర్జున్ పోలీసులకు కంప్లయింట్ చేశాడు. కేసు ఫైల్ చేసిన రాజేంద్రనగర్ పోలీసులు అపార్ట్ మెంట్ లోని సీసీ కెమెరాలను పరిశీలించారు. అర్జున్ ఇంట్లో పనిచేసే వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలానికి చెందిన నేనావత్ లక్ష్మి(40) ఈ చోరీ చేసినట్లు గుర్తించారు. ఆమెను అదుపులోకి తీసుకున్నారు. నిందితురాలి నుంచి రూ.3 లక్షల 60వేల 650ను స్వాధీనం చేసుకున్నట్లు డీఐ పవన్ కుమార్ తెలిపారు.