
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధంతో ప్రపంచ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ సంక్షోభం వస్తుందని ప్రపంచ దేశాలు భయపడుతున్నాయి. ఇరాన్ ఆర్మూజ్ జలసంధిని మూసివేస్తే పరిస్థితి ఏంటనే ఆందోళనలో వివిధ దేశాలు ఉన్నాయి. క్రూడ్ ఆయిల్ దిగుమతి ఆగిపోతే ఆర్థిక సంక్షోభంతో దివాళా తీసే పరిస్థితి వస్తుందనే భయంలో ఉన్నాయి. కానీ ఇండియా మాత్రం సేఫ్ గా ఉన్నట్లు ప్రకటించింది.
అందుకు కొన్ని శతాబ్దాల క్రితం నుంచి ఇండియా అమలు చేస్తూ వస్తున్న మాస్టర్ ప్లానే కారణమని తెలుస్తోంది. దేశ వ్యాప్తంగా భూగర్భంలో నిర్మించిన రాతి గుహలు ఇవాళ ఇండియాను సంక్షోభం నుంచి బయటపడేశాయని చెబుతున్నారు. ఏంటి ఈ రాతి గుహలు.. దేశ వ్యాప్తంగా ఎక్కడెక్కడున్నాయి.. క్రూడ్ ఆయిల్ నిల్వలో ఎలా ఉపయోగపడుతున్నాయో తెలుసుకుందాం.
ఇరాన్ ఆర్మూజ్ జలసంధి మూసివేసినా ఇండియాకు ఎలాంటి నష్టం లేదని పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి ప్రకటించారు. అందుకు కారణం భారత్ కు క్రూడ్ ఆయిల్ రిజర్వ్స్ ఉండటమే. దేశ వ్యాప్తంగా చాలా ఆయిల్ రిజర్వ్స్ ఉన్నప్పటికీ మూడు కీలక భూగర్భ ఆయిల్ స్టోరేజ్ గుహలు ఏ సంక్షోభం వచ్చినా ఎదుర్కునేలా ఉన్నాయని చెప్పారు.
ఇండియా కొన్ని మిలియన్ మెట్రిక్ టన్నుల ఆయిల్ ను నిల్వ ఉంచుకుంటుంది. స్ట్రాటజిక్ పెట్రోలియ రిజర్వ్స్ (SPR) లో భాగంగా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడులో ఉన్న అతి పెద్ద భూగర్భ రాతి గుహలలో స్టోర్ చేసుకుంటూ వస్తోంది ఇండియా. ఒడిశా, కర్ణాటకలో మరో రెండు నిల్వ కేంద్రాలు కూడా ఇందులో కీలకంగా మారాయి. మిడిల్ ఈస్ట్ లో వస్తున్న ఉద్రిక్త పరిస్థితుల ప్రభావం పడకుండా ఆయిల్ నిల్వ చేసుకుంటుంది భారత్.
హార్మూజ్ జలసంధి:
గత 12 రోజులుగా ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధం కారణంగా ప్రపంచ దేశాలకు ఆయిల్ రవాణాలో కీలకమైన హార్మూజ్ జలసంధిని మూసివేస్తామని ఇరాన్ ప్రకటించింది. ఇదే ఇప్పుడు ప్రపంచ దేశాలను భయపెడుతున్న అంశం. పర్షియన్ దేశాలతో పాటు సౌదీ అరేబియా, కువైట్, ఇరాక్ మొదలైన దేశాలు ఈ 33 కిలోమీటర్ల జలసంధిపైనే ఆధారపడి ఉన్నాయి. ఎగుమతులు, దిగుమతులకు ఈ జలసంధే ఆధారం. ఒకవేళ ఇరాన్ సరఫరా ఆపేసినా ఈ దేశాల నుంచి క్రూడ్ ఇంపోర్ట్ చేసుకోవచ్చు. కానీ జలసంధిని మూసివేస్తే ఇక అది క్లిష్టతరంగా మారుతుంది. ఆయిల్ తో పాటు నేచురల్ గ్యాస్ సరఫరా కూడా జలసంధి నుంచే ఉన్న ఏకైక సులువైన మార్గం.
ప్రపంచంలో అత్యధిక క్రూడ్ దిగుమతి చేసుకునే దేశాలలో ఇండియా మూడో స్థానంలో ఉంది. 80 శాతం క్రూడ్ ఆయిల్ ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిందే. ఈ డిమాండ్ రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. అయితే యుద్ధం కారణంగా బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధరలు ప్రపంచ వ్యాప్తంగా పెరిగినా.. ఇండియా మాత్రం ఎలాంటి ఆందోళనకు గురికావడం లేదు. దీనికి కారణం ముందస్తుగా అనుసరించిన విధానాలే.
ఆయిల్ సప్లై అవాంతరాలను ఎలా అధిగమించింది..
మూడో అతిపెద్ద ఆయిల్ ఇంపోర్టర్ అయిన ఇండియా.. దిగుమతికి సంబంధించి ఒకటి రెండు దేశాలపై ఆధారపడకుండా లిస్టును డైవర్సిఫై చేసుకుంది. భవిష్యత్తులో ఇలాంటి క్లిష్ట పరిస్థితులు వస్తాయని తెలిసి చాలా దేశాలతో ట్రేడ్ డీల్ కుదుర్చుకుంది. అందులో భాగంగా అమెరికా, నైజీరియా, అంగోలా, బ్రెజిల్ తదితర దేశాలను లిస్టులో చేర్చుకుంది. ఈ దేశాల నుంచి క్రూడ్ రావాలంటే సూయిజ్ కెనాల్, పనామా కెనాల్ లాంటి వాటి నుంచి రావాల్సి వస్తుంది. ఇది రవాణా దూరంతో పాటు ఖర్చులను కూడా పెంచే మార్గం. అయినప్పటికీ ఒకరిపైనే ఆధారపడకుండా ఉండేందుకు ఈ దేశాలతో ట్రేడ్ డీల్ కుదుర్చుకుంది. దీంతో హార్మూజ్ జలసంధి మూసివేసినా ఎలాంటి ప్రభావం పడకుండా సేఫ్ గా ఉంది ఇండియా.
దీనికి తోడు రష్యా నుంకి కంటిన్యూగా క్రూడ్ ఆయిల్ కొనుగోలు చేస్తూనే ఉంది. ఉక్రెయిన్-రష్యా యుద్ధం కారణంగా రష్యా నుంచి ఆయిల్ దిగుమతులు ఆపేయాలని అమెరికా హెచ్చరించినా ఇండియా తన చిరకాల స్నేహితుని నుంచి ఆయిల్ దిగుమతి చేసుకుంటూ నిల్వలు పెంచుకుంది. ఇక నుంచి రోజుకు 2.2 మిలియన్ బ్యారల్ ను దిగుమతి చేసుకోవాలని సిద్ధమైంది. ఇది ఇరాక్, సౌదీ అరేబియా దేశాలతో కోనే ఆయిల్ కంటే ఎక్కువ అని కేప్లర్ (Kpler) రిపోర్ట్ ద్వారా వెల్లడించింది.
భూగర్భ రాతి గుహలు.. భారత్ వ్యూహం:
ఇండియాకు మూడు కీలకమైన భూగర్భ రాతి గుహలు ఉన్నాయి. భూ ఉపరితలం నుంచి 90 మీటర్ల కింద ఉన్న ఈ గుహలు కిలోమీటర్ లోతు వరకు ఉన్నాయి. విశాఖపట్నం లో ఉన్న ఎల్పీజీ గుహ.. 196 మీటర్ల లోతులో అంటే.. సముద్ర లోతు కంటే కింద ఉంది. ఇది ప్రపంచంలోనే అత్యంత లోతులో ఉన్న స్టోరేజ్ సెంటర్.
ఈ మూడు రాతి గుహలలో 5.33 మిలియన్ మెట్రిక్ టన్స్ (MMT) క్రూడ్ ఆయిల్ చేసుకునే సామర్థ్యం ఉంది. ఇది ఇండియా పది రోజులు వాడుకునే సామర్థ్యం. దీనికి తోడు 2021లో మరో రెండు స్టోరేజ్ కేంద్రాల ఏర్పాటుకు ఆదేశించింది. ఒడిశా చాందిఖోల్ లో 4 MMT, కర్ణాటక పదూర్ లో 2.5 MMT సామర్థ్యం ఉన్న స్టోరేజ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది. ఇవి కూడా పూర్తైతే ఇండియా 22 రోజుల పాటు డీజిల్, పెట్రోల్ కొరత లేకుండా ఉండగలదు.
అయితే ఇటీవల తీసుకొచ్చిన గ్రీన్ ఎనర్జీ పాలసీ ద్వారా ఇండియాకు మరికొంత ఆయిల్ సేవ్ అయ్యే పరిస్థితులు ఉన్నాయి. ఎలక్ట్రిక్, సీఎన్జీ వాహనాల పెంపుతో మునుపటికి ఉన్న ఆయిల్ డిమాండ్ కాస్త తగ్గుతూ వస్తోంది. రానురాను క్రూడ్ ఆయిల్ పై ఆధారపడకుండా ఉండేందుకు మరిన్ని ప్రణాళికలు రచిస్తోంది. సో.. ఇరాన్ ఆర్మూజ్ జలసంధి మూసివేసినా.. ఒక 22 రోజలు వాడుకునే నిల్వలు ఇండియా దగ్గర ఉంటాయి. అంతలోపు ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుని సేఫ్ గా ఉండనుందని Kpler నివేదిక ద్వారా తెలుస్తోంది.