మేకను మింగి స్కూల్‌ బస్సులోకి దూరిన భారీ కొండచిలువ

మేకను మింగి స్కూల్‌ బస్సులోకి దూరిన భారీ కొండచిలువ

ఓ పాఠశాల బస్సులో భారీ కొండచిలువ కలకలం సృష్టించింది. ఉత్తర్ ప్రదేశ్ లోని రాయ్ బరేలీలో ఈ ఘటన జరిగింది. స్థానిక ర్యాన్ ఇంటర్నేషనల్ స్కూల్ కు చెందిన ఓ బస్సును ఊరికి దగ్గర్లో నిలిపారు. ఈ సమయంలో ఒక మేకను మింగిన కొండచిలువ.. అనంతరం స్కూల్ బస్సులోకి దూరిందని గ్రామస్థులు తెలిపారు. ఈ విషయాన్ని పాఠశాల యాజమాన్యానికి తెలియజేయగా వారు అటవీ అధికారులకు సమాచారమందించారు. దీంతో బస్సు సీట్ల కింద ఉన్న భారీ కొండచిలువను సురక్షితంగా బంధించారు.

దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదమూ జరగలేదని సిటీ మెజిస్ట్రేట్ పల్లవి మిశ్రా తెలిపారు. వీకెండ్ కావడంతో విద్యార్థులకు ప్రమాదం తప్పిందని చెప్పారు. అనంతరం బస్సులో నక్కిన ఈ భారీ కొండచిలువను తాడు సాయంతో బంధించిన అధికారులు.. సురక్షితంగా అక్కడి నుంచి తరలించారు. ఆ తర్వాత ఆ బస్సును స్కూలు ఆవరణలో పార్క్ చేశారు.