
- ఇంటి ముందు పార్క్ చేసిన బైక్ను తీయాలన్నందుకు కొట్టి చంపిన ఇద్దరు యువకులు
న్యూఢిల్లీ: పార్కింగ్ విషయంలో తలెత్తిన గొడవలో నటి హుమా ఖురేషీ కజిన్ ఆసిఫ్ ఖురేషీ (42) పై ఇద్దరు యువకులు దాడిచేసి చంపేశారు. ఢిల్లీలోని బోగల్ ఏరియాలో గురువారం రాత్రి 10.30 గంటలకు ఈ ఘటన జరిగింది. నిందితులను ఉజ్వల్ (19), గౌతమ్ (18) గా గుర్తించారు. వారిద్దరూ అన్నదమ్ములు. మ్యూజీషియన్ గా పనిచేస్తున్న ఉజ్వల్ రాత్రి ఇంటికి తిరిగివచ్చాడు.
తన బైక్ ను ఆసిఫ్ ఇంటి ఎదురుగా పార్క్ చేశాడు. ఇంటి ఎదురుగా బండి పార్క్ చేయవద్దని, బండిని తీయాలని ఉజ్వల్ కు ఆసిఫ్ చెప్పాడు. కాసేపటి తర్వాత ఉజ్వల్ తన సోదరుడు గౌతమ్ ను వెంటబెట్టుకొచ్చి ఆసిఫ్ ఇంటికెళ్లాడు.
ఇద్దరూ ఆసిఫ్ తో వాదనకు దిగారు. తర్వాత విచక్షణారహితంగా కొట్టారు. పదునైన ఆయుధంతో ఆసిఫ్ చాతీలో పొడిచి పారిపోయారు. స్థానికులు బాధితుడిని నేషనల్ హార్ట్ ఇన్ స్టిట్యూట్ కు తీసుకెళ్లారు. అప్పటికే ఆసిఫ్ చనిపోయాడని డాక్టర్లు తెలిపారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు నిందితులు ఉజ్వల్, గౌతమ్ పై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.