ఐదు వందల రూపాయలు భార్యాభర్తల ప్రాణాలు తీసింది. ఈ విషాద ఘటన ఏపీలోని కృష్ణాజిల్లా గుడివాడలో జరిగింది. వాసవి నగర్ లో ఉండే కొలుసు రాంబాబు, కనకదుర్గ అనే భార్యాభర్తల మధ్య 500 రూపాయల కోసం చిన్న గొడవ జరిగింది. రూ. 500 అడిగితే ఇవ్వలేదనే మనస్తాపంతో తాగిన మైకంలో భార్యపై కోపంతో ఇంట్లో ఉరేసుకున్నాడు రాంబాబు. వెంటనే భార్య కనకదుర్గ ఈ విషయాన్ని తన కుమారుడికి చెప్పింది. ఇంటికి వచ్చిన కొడుకు తన తండ్రిని కారులో హాస్పిటల్ తీసుకెళ్లగా..అప్పటికే రాంబాబు చనిపోయినట్లు డాక్టర్లు చెప్పారు.
తండ్రి చనిపోయాడన్న విషయాన్ని కొడుకు వెంటనే తల్లికి ఫోన్ చేసి చెప్పాడు. భర్త మరణాన్ని తట్టుకోలేని కనకదుర్గ ఇంట్లో ఉరేసుకుంది. తండ్రి మృతదేహాన్ని తీసుకుని ఇంటికి వచ్చిన కొడుకు వెంటనే ఫ్యాన్ కు వేలాడుతున్న తల్లిని హాస్పిటల్ కు తీసుకెళ్లేందుకు ప్రయత్నించాడు. కానీ అప్పటికే ఆమె చనిపోయింది. ఒకే రోజు భార్యాభర్తలు చనిపోవడంతో స్థానికులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఘటన తెలుసుకున్న పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. భార్యాభర్తల మరణానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు.