
- భద్రాద్రికొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలంలో ఘటన
చండ్రుగొండ, వెలుగు : భార్య కాపురానికి రాలేదని భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై శివరామకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. భద్రాద్రికొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం వెంకటయ్యతండాకు చెందిన ఇస్లావత్ మధుసూదన్ రావు(28) కు మూడేండ్ల కింద వివాహం జరిగింది. తరుచూ మద్యం తాగుతూ భార్యతో గొడవ పడేవాడు. ఈ క్రమంలో భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. ఎన్నిసార్లు రావాలని కోరినా, ఆమె రాకపోవడంతో మనస్తాపంతో మధుసూదన్ రావు సోమవారం రాత్రి ఇంట్లో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తండ్రి రామచంద్రు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
భార్య వివాహేతర సంబంధం పెట్టుకుందని..
బోయినిపల్లి: భార్య వివాహేతర సంబంధం పెట్టుకుందని రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం తడగొండ గ్రామానికి చెందిన కుంటాల హరీశ్(36) సూసైడ్ చేసుకున్నాడు. ఎస్సై రాజ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన హరీశ్కు 2014లో కావేరితో వివాహం జరిగింది. వీరికి కూతురు వినయశ్రీ, కొడుకు హార్థిక్ ఉన్నారు. జీవనోపాధికి హరీశ్ గల్ఫ్ కు వెళ్లాడు. ఆ సమయంలో కావేరి అదే గ్రామానికి చెందిన మన్నే రక్షణ్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది.
రెండు రోజుల కింద హరీశ్ గ్రామానికి వచ్చాడు. భార్య వివాహేతర సంబంధం విషయం తెలిసి, భార్యను నిలదీయడంతో తాను రక్షణ్ తోనే ఉంటానని నువ్వు చచ్చిపోమని అనడంతో అవమానంతో మంగళవారం గ్రామ శివారులోని వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తల్లి ప్రమీల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.