భార్యపై కోపంతో కొడుకును సంపిండు

భార్యపై కోపంతో కొడుకును సంపిండు
  •     ఆకలవుతుందని ఏడ్చిన కొడుకు 
  •     పాలల్లో నిద్రమాత్రలు కలిపి ఇచ్చిన తండ్రి
  •     స్కూల్​కు వెళ్లి తప్పించుకున్న బిడ్డ 
  •     గద్వాల జిల్లా అయిజలో దారుణం 

అయిజ, వెలుగు : గద్వాల జిల్లా అయిజలో భార్యపై కోపంతో ఓ భర్త తన కన్న కొడుకునే చంపేశాడు. పట్టణంలోని పాత పోలీస్​స్టేషన్​ఏరియాకు చెందిన భార్గవ్ కు నాగర్​కర్నూల్​జిల్లా వీపనగండ్ల మండలం పెంట్లవెల్లికి చెందిన శ్రావణితో ఐదేండ్ల కింద పెండ్లయ్యింది. వీరికి రెండేండ్ల కొడుకు నందకుమార్(2) తో పాటు ఒక పాప ఉంది. మొదటి నుంచి భార్గవ్ భార్య శ్రావణిపై అనుమానం పెంచుకొని వేధిస్తూ ఉండేవాడు. ఇటీవల భార్యాభర్తల మధ్య గొడవలు ఎక్కువయ్యాయి. దీంతో భార్యను ఇంటి నుంచి బయటకు వెళ్లకుండా ఇంట్లోనే ఉంచి ఇబ్బంది పెట్టేవాడు. దీంతో మనస్తాపానికి గురైన శ్రావణి ఇటీవల కొడుకు నందకుమార్ తో పాటు బిడ్డను కూడా అత్తింట్లోనే వదిలి పుట్టింటికి వెళ్లిపోయింది. పిల్లలను భార్గవ్​ తల్లి కుమారి చూసుకుంటోంది. అప్పటినుంచి భార్గవ్​భార్యపై కోపంతో ఉన్నాడు. 

గురువారం ఉదయం కూతురు స్కూల్​కు వెళ్లింది. కొద్దిసేపటికే ఆకలవుతోందని కొడుకు ఏడవడంతో కొన్ని నిద్రమాత్రలను పౌడర్​చేసి పాలలో కలిపి కొడుక్కి తాగించాడు. దీంతో బాలుడు అపస్మారక స్థితిలోకి వెళ్లి చనిపోయాడు. తర్వాత భార్గవ్​కూడా నిద్రమాత్రలు మింగి భార్యకు ఫోన్​చేసి విషయం చెప్పాడు. ఆమె వీపనగండ్ల పోలీసులకు చెప్పడంతో వారు అయిజ పోలీసులకు సమాచారం ఇచ్చారు. వాళ్లు వెళ్లి చూసేసరికి బాబు చనిపోయి ఉన్నాడు. భార్గవ్​అపస్మారక స్థితిలో ఉండడంతో దవాఖానకు తరలించారు. ఘటనా స్థలాన్ని శాంతినగర్  సీఐ శివశంకర్ గౌడ్  పరిశీలించి విచారణ చేపట్టారు. భార్గవ్​తల్లి పాత్ర ఉందన్న అనుమానంతో ఆమెను అరెస్ట్​చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు  తెలిపారు.