ఆసుపత్రిలోనే భార్య పై లైంగిక దాడి

ఆసుపత్రిలోనే భార్య పై లైంగిక దాడి

తాగిన మత్తులో కట్టుకున్న భార్య పైనే మృగంలా ప్రవర్తించాడు  ఓ భర్త.  తాము ఎక్కడున్నాం.? ఏ పరిస్థితిలో ఉన్నామనే విషయం కూడా మరచిపోయి ఆమెపై అతడు దారుణంగా లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆ మృగాడి దాడితో ఆమె ప్రస్తుతం చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. చిత్తూరు జిల్లా ప్రభుత్వాసుపత్రిలో జరిగింది ఈ దారుణ ఘటన.

జిల్లాలోని యాదమరి మండలం పీసీ కండ్రిగ గ్రామానికి చెందిన నంద, పద్మ లు కూలీ పని చేసుకుంటూ జీవిస్తున్నారు. మూడ్రోజుల క్రితం వారి కూతురు జమునకు జ్వరం తీవ్రం కావడంతో చిత్తూరు ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు. అయితే ఆదివారం రాత్రి మద్యం సేవించిన నంద ఆస్పత్రికి వెళ్లి, కూతురి దగ్గర ఉన్న భార్య పద్మను తన కోరిక తీర్చమని బలవంతం చేశాడు. భార్య తిరస్కరించడంతో మృగంలా మారి లైంగిక దాడి చేసి.. కొట్టి పోయాడు. ఆస్పత్రి మెట్ల దగ్గర రక్తపు మడుగులో పడి ఉన్న తల్లిని చూసిన రెండో కూతురు ఆస్పత్రి సిబ్బందికి సమాచారం అందించింది.

తీవ్ర గాయాలైన పద్మకు డాక్టర్లు అత్యవసర విభాగానికి తరలించి చికిత్స చేశారు. ఆమె ప్రస్తుతం కోమాలో ఉంది. లైంగిక దాడిలో అవయవాలు సైతం తీవ్రంగా దెబ్బ తిన్నాయని వైద్యులు తెలిపారు.. బాధితురాలి బంధువుల ఫిర్యాదుతో పోలీసులు భర్త నందను హత్యాయత్నం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.