
భార్యతో పాటు మరో ఇద్దరి అరెస్టు
వరంగల్, వెలుగు: ఇన్సురెన్స్ డబ్బుల కోసం భర్తను హత్య చేసిన భార్యతో పాటు ఆమెకు సహకరించిన ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. వరంగల్ రూరల్ జిల్లా పర్వతగిరి మండలం హతియా తండాకు చెందిన బాదావత్ వీరన్న తాగుడుకు అలవాటు పడి భార్యపిల్లలను వేధించేవాడు. దీంతో విసిగిపోయిన ఆయన భార్య యాకమ్మ అతన్ని చంపాలని, దాంతో వేధింపులు పోవడమే కాక బీమా పైసలు వస్తాయని ఆశపడింది.
చెన్నారావుపేట మండలం శంకర తండాలో ఉండే వీరన్న చెల్లెలు భూక్య బుజ్జి, ఆమె భర్త బిచ్యలతో కలిసి ఈనెల 19న హత్యచేసినట్టు వరంగల్ ఈస్ట్ జోన్ ఇన్చార్జి డీసీపీ వెంకటలక్ష్మి చెప్పారు. తండా సమీపంలో ముగ్గురు కలిసి వీరన్నను చంపి కెనాల్లో పడేశారు. సీసీ కెమెరాల ద్వారా నిందితులను గుర్తించినపర్వతగిరి పోలీసులు.. సోమవారం వారిని పట్టుకుని విచారించగా హత్య చేసినట్టు ఒప్పుకున్నారు.