
- జీవీకే వద్ద ఫుట్ ఓవర్ బ్రిడ్జి, ఓల్డ్సిటీలో మెట్రో పనుల పరిశీలన
- అదనపు నిధులు కేటాయిస్తామని హామీ
హైదరాబాద్సిటీ, వెలుగు: ప్రభుత్వ కొత్త ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఆదివారం నగరంలోని పలు ప్రాంతాలను పరిశీలించారు. ఇందులో భాగంగా జీహెచ్ఎంసీ, వాటర్బోర్డు, పాతబస్తీలో మెట్రో ప్రాజెక్టుల పనులు తీరును తెలుసుకున్నారు. అంబర్పేటలో 212.5 ఎమ్మెల్డీ కెపాసిటీ సీవరేజ్ట్రీట్మెంట్ప్లాంట్ను సందర్శించారు. ప్రైమరీ ట్రీట్మెంట్ యూనిట్ ను సందర్శించిన ఆయన ఐఎన్డీ, స్పిల్టర్ బాక్స్, కనెక్టింగ్ చానెల్స్ ఎస్బీఆర్బేసిన్స్, సీసీటీ తదితర పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. జూన్ లో ఎస్టీపీని అందుబాటులోకి తెచ్చేలా చర్యలు తీసుకుంటామని వాటర్బోర్డు ఎండీ అశోక్రెడ్డి వివరించారు. ఈ ఎస్టీపీ పూర్తి చేస్తే దేశంలోనే 98 శాతం సీవరేజీ ట్రీట్మెంట్ చేస్తున్న ఏకైక నగరంగా హైదరాబాద్ నిలవనుందన్నారు.
బల్దియా పరిధిలోనే కాకుండా ఓఆర్ఆర్ పరిధిలో అమృత్ 2.0 ప్రాజెక్టు భాగంగా మరో 39 ఎస్టీపీలను నిర్మాణం చేపట్టడానికి ప్రణాళికలు సిద్ధం చేశామని, అవి టెండర్ దశలో ఉన్నాయని సీఎస్ కు వివరించారు. అధునాతన సీక్వెన్సింగ్ బ్యాచ్ రియాక్టర్ టెక్నాలజీతో కొత్త ఎస్టీపీలను నిర్మిస్తున్నామని, వీటి వల్ల ఒకే ఛాంబర్లో ఐదు స్టేజీల మురుగు శుద్ధి ప్రక్రియ జరిగి, తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ నీటిని శుద్ధి చేయవచ్చన్నారు. ఎస్టీపీ నుంచి దుర్వాసన రాకుండా చర్యలు తీసుకోవాలని సీఎస్సూచించగా, దానికోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు అశోక్ రెడ్డి చెప్పారు.
తర్వాత వినియోగంలో ఉన్న 339 ఎంఎల్డీల పాత ఎస్టీపీ అవుట్ లెట్ వద్ద శుద్ధి చేసిన నీటిని సీఎస్ పరిశీలించారు. పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి ఇలంబర్తి, వాటర్బోర్డు ఈడీ మయాంక్ మిట్టల్, హెచ్ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, బల్దియా కమిషనర్ కర్ణన్ బోర్డు ప్రాజెక్టు డైరెక్టర్ సుదర్శన్ పాల్గొన్నారు. బంజారాహిల్స్ లోని జీవీకే వద్ద నిర్మించించిన ఫుట్ ఓవర్ బ్రిడ్జి పనులను కూడా సీఎస్పరిశీలించారు. ఖుర్షీద్ ఝా దేవిడి హెరిటేజ్ భవన్ఇన్నోవేషన్ పనులను పరిశీలించి అక్కడి నుంచి ఫలక్ నుమా ఆర్ఓబీ పనులు ఎలా జరుగుతున్నాయో చూశారు. ఈ పనులను ఆగస్టు వరకు పూర్తి చేయాలని ఆదేశించారు. మూసీపై ముసారంబాగ్ వద్ద చేపట్టిన బ్రిడ్జి పనులను పరిశీలించారు.
ఓల్డ్ సిటీ మెట్రోకు అదనపు నిధులు
ఓల్డ్ మెట్రో పనులను వేగవంతం చేయడానికి అదనపు నిధులు కేటాయిస్తామని సీఎస్రామకృష్ణారావు అన్నారు. మెట్రో ఫేజ్ 2, పార్ట్ బీ కు సంబంధించి జేబీఎస్ – శామీర్ పేట్, జేబీఎస్– మెడ్చల్, శంషాబాద్ – ఫ్యూచర్ సిటీ మెట్రో కారిడార్ల డీపీఆర్లు సిద్ధమయ్యాయని, వాటిని పరిశీలించి త్వరలో జరగబోయే హెచ్ఏఎంఎల్ సమావేశంలో ఆమోదిస్తామన్నారు. మంత్రి వర్గం కూడా ఆమోదించాక కేంద్రం వద్దకు పంపుతామని వెల్లడించారు.
మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డితో కలిసి ఓల్డ్ సిటీ మెట్రో కారిడార్ ను విజిట్చేసిన ఆయన మెట్రో రైల్ మార్గంలో జరుగుతున్న రోడ్డు విస్తరణ పనులను పరిశీలించారు. దశాబ్ద కాలంగా నిర్లక్ష్యానికి గురైనా ఇప్పుడు ఓల్డ్ సిటీ మెట్రో పనులు స్పీడ్గా సాగుతుండడంపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఎంజీబీఎస్ నుంచి చంద్రాయణ గుట్ట వరకు7.5 కిలోమీటర్ల నిర్మిస్తున్న ఈ కారిడార్ లో ప్రభావిత ఆస్తుల కూల్చివేతలను మెట్రో ఎండీ, సీఎస్ కు వివరించారు.