హైదరాబాద్లో ట్రాఫిక్ ఆంక్షలు...ఈ రూట్లలో డైవర్షన్

హైదరాబాద్లో ట్రాఫిక్ ఆంక్షలు...ఈ రూట్లలో  డైవర్షన్

హైదరాబాద్ నగరంలో అక్టోబర్ 22వ తేదీన ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. సద్దుల బతుకమ్మ పండగను పురస్కరించుకుని లుంబినీ పార్క్, అప్పర్ ట్యాంక్ బండ్ పై ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతున్నాయి. అక్టోబర్ 22వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ఆంక్షలు ఉంటాయని ట్రాఫిక్ అదనపు సీపీ సుధీర్ బాబు వెల్లడించారు. 

Also Read :- గ్రూప్ 1 రద్దుపై సుప్రీంకు టీఎస్​పీఎస్సీ!

ఇలా డైవర్షన్

  • అక్టోబర్ 22వ తేదీన తెలుగు తల్లి ఫ్లై ఓవర్, కర్బాలా మైదాన్ నుంచి వచ్చే వాహనాలకు ట్యాంక్ బండ్ మీదుగా అనుమతి లేదు. మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు అనుమతించబోమని పోలీసులు తెలిపారు. 
  • సికింద్రాబాద్ నుంచి ట్యాంక్ బండ్ వైపు వచ్చే వాహనాలను కర్బాలా మైదాన్ దగ్గర బైబిల్ హౌస్ మీదుగా తెలుగు తల్లి ఫ్లై  ఓవర్ వైపు డైవర్ట్ చేస్తారు. ఎక్బాల్ మినార్ నుంచి వచ్చే వాహనాలను తెలుగు తల్లి ఫ్లై ఓవర్ వైపు మళ్లిస్తారు. 
  • పంజాగుట్ట, రాజ్ భవన్ నుంచి ఖైరతాబాద్ ఫ్లై ఓవర్ మీదుగా వచ్చే వాహనాలను నెక్లెస్ రోటరీ ఇందిరాగాంధీ విగ్రహం దగ్గర ఐమాక్స్ రూట్ లోకి డైవర్ట్ చేస్తారు. 
  • నల్లగుట్ట నుంచి బుద్ద భవన్ వైపు వాహనాలకు అనుమతి లేదు. నల్లగుట్ట క్రాస్ రోడ్డు దగ్గర రాణిగంజ్, నెక్లెస్ రోడ్డు వైపు ఈ వాహనాలను మళ్లిస్తారు. 
  • హిమాయత్ నగర్, బషీర్ బాగ్, అంబేద్కర్ విగ్రహం వైపు నుంచి ట్యాంక్ బండ్ వైపు వచ్చే వాహనాలు ఇక్బాల్ మినార్ వైపు వెళ్లి యూ టర్న్ తీసుకుని తెలుగు తల్లి జంక్షన్, తెలుగు తల్లి ఫ్లై ఓవర్ పై నుంచి వెళ్లాల్సి ఉంటుంది. 
  • ముషీరాబాద్ నుంచి ట్యాంక్ బండ్ వైపు వచ్చే వాహనాలను కవాడిగూడ క్రాస్ రోడ్డు దగ్గర మళ్లిస్తారు. అలాగే సికింద్రాబాద్ నుంచి వచ్చే వాహనాలను డీబీఆర్ మిల్స్ దగ్గర కట్టమైసమ్మ ఆలయం, తెలుగు తల్లి ఫ్లై ఓవర్ వైపు మళ్లిస్తారు. 
  • జిల్లాల నుంచి వచ్చే ఆర్టీసీ బస్సులను జేబీఎస్ స్వీకార్ ఉపకార్ దగ్గర డైవర్ట్ చేస్తారు. సిటీ బస్సులను కూడా కర్బాలా మైదాన్ దగ్గర మళ్లిస్తారు. 
  • సద్దుల బతుకమ్మ వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చే వారి కోసం స్నో వరల్డ్, ఎన్టీఆర్ స్టేడియం, ఎన్టీఆర్ గార్డెన్ పక్కనే పార్కింగ్ స్థలాలను కేటాయించారు.